ఆమెకు 18ఏళ్ల కొడుకు, 15ఏళ్ల కూతురు: పెళ్లై 17ఏళ్ల తర్వాత మళ్లీ ప్రేమలో పడింది, పెళ్లి కూడా, కోర్టుకు
హైదరాబాద్: నేటి కాలంలో వివాహేతర సంబంధాల కారణంగా అనేక దారుణాలు జరుగుతున్న విషయం తెలిసింది. భాగస్వాములలో ఎవరో ఒకరు మూడు ముళ్ల బంధాన్ని పక్కనపెట్టి మరొకరితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ ఆ బంధాన్ని పరిహాసం చేస్తున్నారు.
పెళ్లైన 17ఏళ్లకు మళ్లీ ప్రేమలో..
హైదరాబాద్ నగరంలో తాజాగా జరిగిన వివరాల్లోకి వెళితే.. ప్రేమించి పెళ్లి చేసుకుంది ఓ జంట. అయితే, వివాహమై, పిల్లలు కూడా అయిన తర్వాత దాదాపు 17ఏళ్లకు మరొకరి ప్రేమలో పడింది భార్య. ఆ తర్వాత కట్టుకున్న భర్తకు విడాకులిచ్చేందుకు కూడా సిద్ధపడింది. అంతేగాక, కోర్టు నుంచి తీర్పు రాకుండానే ఆమె ప్రియుడితో మరో పెళ్లి చేసుకుంది.
ఆమెకు 17ఏళ్ల కొడుకు.. 15ఏళ్ల కుమార్తె..
ఈ క్రమంలో ఆమె మొదటి భర్త సిటీ సివిల్ కోర్టును ఆశ్రయించారు. కోర్టు సూచన మేరకు ఆమెపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకృష్ణనగర్ ప్రాంతానికి చెందిన అశోక్(42) ఓ యువతిని ప్రేమించి 1999, మే నెలలో వివాహం చేసుకున్నాడు. వారికి ఇప్పుడు 18ఏళ్ల కుమారుడు, 15ఏళ్ల కుమార్తె ఉండటం గమనార్హం.
మరో వ్యక్తితో ప్రేమలో.. పెళ్లి కూడా..
కాగా, 2016లో ఖమ్మం జిల్లాకు చెందిన వేణుగోపాల్తో అశోక్ భార్య మరోసారి ప్రేమలో పడింది. ఈ అంశంపై భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. కోర్టులో ఈ వ్యవహారం కొలిక్కిరాకుండానే 2017లో ఖమ్మంలో వేణుగోపాల్ను ఆమె వివాహం చేసుకుంది.
మొదటి భర్తకు కోర్టుకు..
అంతేగాక, వారిద్దరూ భార్యాభర్తలమని చెప్పి ఇంటి రుణం కూడా తీసుకున్నారంటూ కోర్టును ఆశ్రయించారు అశోక్. ఈ క్రమంలో ఈ విషయంపై దర్యాప్తు చేయాలని బంజారాహిల్స్ పోలీసులకు కోర్టు ఆదేశించింది. దీంతో అశోక్ భార్యపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.