‘చదవలేకపోతున్నా! క్షమించండి.. అన్నా అన్నీ నీవే..’: మెడికో ఆత్మహత్య
జిల్లాలోని మరిపెడ మండలంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. తాను తన తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు డాక్టర్ కాలేకపోతున్నానని, అందుకు తగినవిధంగా చదవలేకపోతున్నానని లేఖ రాసి ఓ వైద్యవిద్యార్థి ఆత్మహత్య.
మహబూబాబాద్: జిల్లాలోని మరిపెడ మండలంలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. తాను తన తల్లిదండ్రులు కోరుకుంటున్నట్లు డాక్టర్ కాలేకపోతున్నానని, అందుకు తగినవిధంగా చదవలేకపోతున్నానని లేఖ రాసి ఓ వైద్యవిద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో అతని కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. మరిపెడ మండలానికి చెందిన గుగులోతు నామ ప్రభుత్వ ఉపాధ్యాయుడు, భార్య శోభ ఎంపీటీసీ సభ్యురాలు. వీరికి ఇద్దరు కుమారులుండగా, ఇద్దరినీ ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. పెద్ద కుమారుడు మనోజ్ నల్గొండ జిల్లా లోని నార్కట్పల్లి వద్ద ఉన్న కామినేని ఆస్పత్రిలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.
చిన్న కుమారుడు గుగులోత్ మనోకృష్ణ (20) ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు రిమ్స్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతు న్నాడు. ప్రథమ సంవత్సరంలో కళాశాలలోనే 75 శాతం మార్కులతో 9వ ర్యాంక్ సాధించాడు. మనోకృష్ణ శనివారం ఇంటికి వచ్చాడు. అక్కడ ఏమైనా ఇబ్బందులున్నాయా? అని తండ్రి ప్రశ్నించగా.. అలాంటిదేం లేదని చెప్పాడు.
ఆ తర్వాత గురువారం మనోకృష్ణ ఓ సినిమా చూసి ఇంటికి వచ్చాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మనో కృష్ణ ఫ్యాన్కు ఉరి వేసుకున్నాడు. 'అన్నా.. అన్నీ నీవే..' అని మనోకృష్ణ సూసైడ్ నోట్ రాసి, బెడ్పై పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి తలుపులు తెరవగా కొడుకు శవమై కనిపించాడు. భార్యకు చెప్పగా మండల సభ నుంచి కన్నీరుమున్నీరవుతూ హుటాహుటిన ఇంటికి వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి ఆమె రోదించిన తీరు అక్కడి వారిని కంటతడిపెట్టించింది.
కాగా, 'అన్నా.. మీ అందరినీ వదిలి వెళ్లాలని లేదు. కానీ, చదువుకోవడంలో నాకు నిర్లక్ష్యం ఉంది. నేను అనుకున్న ప్రకారం డాక్టర్ను కానేమో అనే అనుమానం తలెత్తింది. దీంతో చాలా రోజులుగా నరకయాతన అనుభవించాను. చివరకు తప్పని సరి ఇక భూమిమీద ఉండొద్దనే ఆలోచనకు వచ్చి ఈ నిర్ణయం తీసుకున్నా. ఇది తప్పే అని తెలిసి కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్నా. ఇక అన్నీ నీవే.. అమ్మనాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నాకు సాయి, వంశీ, రాజీ, సతీశ్, గోపీ, వసంత ఆంటీ కుటుంబసభ్యులుగా సహకరించారు. నేను ఎక్కడున్నా మీ హృదయాల్లో నిలిచి ఉంటాను. మిమ్మల్ని వదిలి తీసుకున్న ఈ నిర్ణయానికి నన్ను క్షమించాలని కోరుకుంటున్నా' మనోకృష్ణ తన సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.