నెలలో పెళ్లి: మత్తు ఇంజెక్షన్ తీసుకుని వైద్య విద్యార్థిని ఆత్మహత్య
నిర్మల్: జిల్లాలోని ముథోల్లోని మహాలక్ష్మి కాలనీ విషాద ఘటన చోటు చేసుకుంది. దప్కల్ సవిత(26) అనే వైద్య విద్యార్థిని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఆమె కుటుంబంతోపాటు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముథోల్లోని మహాలక్ష్మి కాలనీలోని దప్కల్ గంగాధర్ కుమార్తె సవిత ఇంటర్ పూర్తి కాగానే.. మెడిసిన్లో మంచి ర్యాంకు రావటంతో ఆదిలాబాద్లోని రిమ్స్ కళాశాలలో ఎంబీబీఏస్ పూర్తి చేసింది. రెండు సంవత్సరాల క్రితం ఉస్మానియా వైద్యకళాశాలలో పీజీ సీటు రావటంతో ఆమె మత్తువైద్య శాస్త్రం(అనెస్టీషియా)లో పీజీ చేస్తోంది.
కాగా, వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో ఇంటికి వచ్చింది. ఎప్పటిలాగే ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి బాగానే ఉంది. వ్యవసాయ కుటుంబం కావటంతో తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు పొలానికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిసమయంలో మధ్యాహ్నం మత్తుసూది తీసుకోవటంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పడుకుందని భావించిన కుటుంబసభ్యులు మధ్యాహ్నం ఆమెను నిద్రలోంచి లేపటానికి ప్రయత్నించారు.
అప్పటికే ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన బంధువులు తల్లిదండ్రులకు సమాచారం అందించి వెంటనే ప్రైవేట్ వాహనంలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా, అప్పటికే ఆమె మరిణించినట్లు వైద్యులు తెలిపారు. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపంచారు.
ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై పేర్కొన్నారు. కాగా, సవితకు రెండు నెలల క్రితమే వివాహం నిశ్చయం జరిగింది. మరో నెలరోజుల్లో పెళ్లి ఉండగా.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో ఇంకా తెలియరాలేదు.