వదిలేసిన భర్తతో వివాదాలు: కోర్టు నుంచి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్య
ఆదిలాబాద్: మంచిర్యాల జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లీకూతుళ్లను దుండగులు దారుణంగా హత్య చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు పోలీసులు. డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్, సీఐ లింగయ్య సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఘటనకు సంబంధించిన వివరాలను డీఎస్పీ తెలిపారు.
ఫేస్బుక్ పరిచయం ప్రేమగా..
పూదరి విజయలక్ష్మి(47), ఆమె కూతురు రవీనా(23) స్థానిక బృందావన్కాలనీలో నివాసం ఉంటున్నారు. విజయలక్ష్మి భర్త శంకర్ సింగరేణిలో ఉద్యోగం చేసేవాడు. ఆయన అనారోగ్యంతో ఏడేళ్ల క్రితం మృతి చెందాడు. కాగా, హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న రవీనాకు నిజామాబాద్ జిల్లా బోధన్ సమీపంలోని శంకర్నగర్కు చెందిన కాలేరు అరుణ్ కుమార్తో ఫేస్ బుక్ పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది.
మనస్పర్థలతో భర్తను వదిలేసిన తర్వాత..
ఆ తర్వాత కొంత కాలం ప్రేమించుకున్న రవీనా, అరుణ్ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గత సంవత్సరం జూన్లో వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే, కొన్ని రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో రవీనా భర్తను వదిలేసి, తల్లి వద్దే ఉంటోంది. గత ఫిబ్రవరిలో భర్త అరుణ్ కుమార్పై రవీనా వరకట్న కేసు పెట్టింది. ఈ నేపథ్యంలో విజయలక్ష్మి, రవీనాపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు అరుణ్ కుమార్. ఈ క్రమంలో అరుణ్ కుమార్పై జూన్ 8న విజయలక్ష్మి, రవీనా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అరుణ్ కుమార్పై మరో కేసు నమోదైంది.
కోర్టుకు వెళ్లి తిరిగొచ్చిన తల్లీకూతురు దారుణ హత్య
గురువారం వాంగ్మూలం ఇచ్చేందుకు చెన్నూరు కోర్టుకు వెళ్లివచ్చారు తల్లీకూతుళ్లు. అంతలోనే శుక్రవారం తెల్లవారేసరికి దారుణ హత్యకు గురయ్యారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో సంఘటన స్థలంలో పోలీసులు ఆధారాలు సేకరించారు. ఈ దారుణంలో అరుణ్ కుమార్ హస్తం ఏమైనా ఉందా? లేక ఎవరైనా దొంగలు వచ్చి హత్య చేసివుంటారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ జంట హత్యలు స్థానికంగానే కాక, జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. నిందితులను అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.