'10వేలకు ఆడపిల్ల అమ్మకం' : హైదరాబాద్ లో నిందితుల అరెస్టు
యాచారం/హైదరాబాద్ : లింగ వివక్షనో.. ఆడపిల్లంటేనే గుండెల మీద కుంపటి అన్న అనాగరికతనో.. మొత్తానికి దేశంలో చాలామంది ఆడ శిశువులను అమ్మ కడుపులోనే చిధిమేసే ప్రయత్నాలు జరుగుతుంటే..! ఇంకొన్ని ఘటనల్లో.. తల్లి కడుపు నుంచి శిశువు బయటపడడమే ఆలస్యం.. బేరసారాలు కుదుర్చుకుని అమ్మ ఒడికి దూరం చేసేస్తున్నారు.
తాజాగా నల్గొండలోను ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. నాలుగు రోజుల పసిపాపను రూ.10వేలకు అమ్మేసుకున్నారు సర్దార్ తండాకు చెందిన శిరీష-రవి దంపతులు. అయితే సదరు దంపతుల అమాయకత్వాన్ని ఆసరాగా మలుచుకుని ఓ మధ్యవర్తి ఈ అమ్మకానికి తెరలేపినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే.. నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న సర్దార్ తండాలో నివాసముండే శిరీష రవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఇదే క్రమంలో మరోసారి గర్బం దాల్చిన శిరీష.. నాలుగు రోజుల క్రితం దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో మూడో ఆడపిల్లకు జన్మనిచ్చింది.
ఎల్బీనగర్ లో ఉండే శిరీష రవిల బంధువు అయిన కేతావత్ చక్రి అనే మహిళకు ఈ విషయం తెలిసింది. దీంతో వాళ్ల అమాయకత్వాన్ని అదునుగా భావించి.. ఆడపిల్లను అమ్మేయాల్సిందిగా బేరసారాలు నెరిపింది. ఆమె బేరసారాలకు మెత్తబడ్డ శిరీష రవి దంపతులు రూ.10వేలకు బిడ్డను అమ్ముకున్నారు. అయితే 10వేలకు బిడ్డను కొనుక్కున్న సదరు మధ్యవర్తి.. రూ.50వేలకు మరొకరికి అమ్మడానికి అంతకుముందే ఒప్పందం కుదుర్చుకుంది.
ఆసుపత్రికి వెళ్లి శిరీష రవి దంపతులకు రూ.10వేలు చెల్లించి.. ఆ పసిబిడ్డను కొన్నవారితో కలిసి హైదరాబాద్ బయలుదేరింది. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టడంతో హైదరాబాద్ లోని సాగర్ రోడ్డు వద్ద చక్రితో పాటు పసిపాపను కొనుక్కున్న సునీత, ధనలక్ష్మీ రవికిరణ్ లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అనంతరం శిశువును శిశు విహార్ కు తరలించారు.