ఆశలను చిదిమేసిన విద్యుత్ ఘాతం: నవ వధువు మృతి
హైదరాబాద్: కొత్త ఆశలు, ఎన్నో ఊసులతో అత్తారింట్లో అడుగు పెట్టిన ఆ యువతిని విద్యుత్ ఘాతం రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాద ఘటన శేరిలింగంపల్లి తారానగర్లో చోటు చేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... నారాయణఖేడ్ సుకిల్ధర్ గ్రామానికి చెందిన పండరీనాథ్ కుమార్తె భానుప్రియ(21) అలియాస్ సర్యాబాయికి తారానగర్కు చెందిన శ్రీనివాస్కు 45రోజుల క్రితం వివాహమైంది. శ్రీనివాస్ నల్లగండ్ల కూరగాయల మార్కెట్లో పని చేస్తుంటాడు.
కాగా, భానుప్రియ గురువారం ఉదయం ఇంటిలో నీళ్లు పట్టుకుందాని నల్లా తిప్పగా విద్యుదాఘాతానికి గురైంది. వెంటనే కుటుంబీకులు గుర్తించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పాత భవనం కావడంతో విద్యుత్తు తీగలు షార్ట్ సర్క్యూట్ జరిగి నల్లాకు కరెంటు సరఫరా అయి చనిపోయి ఉంటుందని కుటుంబీకులు తెలిపారు. నవ వధువు మృతి చెందడంతో అటు పుట్టింటో, ఇటు అత్తారింట్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.