పెళ్లి మండపంలో విషాదం: అరుంధతీ నక్షత్రం చూస్తూ వరుడి పాదాలపై కుప్పకూలిన వధువు
నాగర్కర్నూలు: కుటుంబసభ్యులు, బంధుమిత్రుల మధ్య మండపంలో పెళ్లి ఆనందోత్సాహాల మధ్య జరిగింది. ఆ తర్వాత పెళ్లి మండపంలోనే నవ వధువు మృతి చెందండంతో కొద్ది క్షణాల్లోనే ఆ ఆనందం విషాదంగా మారిపోయింది.
ఆనందంగా పెళ్లి
వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని అచ్చంపేటలో శనివారం వెంకటేష్ అనే యువకుడితో బుజ్జ(24)కు వివాహమైంది. కుటుంబసభ్యులు, బంధుమిత్రులు పాల్గొని ఆ నవదంపతులను ఆశీర్వదించారు.
అరుంధతి నక్షత్రం చూస్తూ..
ఆ తర్వాత సాంప్రదాయంలో భాగంగా అరుంధతి నక్షత్రం చూసేందుకు నవదంపతులో పెళ్లి మండపం ఆవరణలోకి వచ్చారు. వరుడు అరుంధతి నక్షత్రం చూపించగా.. నవవధువు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఒక్కసారిగా వరుడి పాదాలపై కుప్పకూలింది.
గుండెపోటుతో..
అప్పటి వరకు ఆనందోత్సాహాల మధ్య ఉన్న వాతావరణం ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోయింది. వెంటనే ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందిందని వైద్యులు తెలిపారు. గుండెపోటు రావడంతనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు.
ఆనందంగా ఉంటారనుకుంటే..
మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన కొంత జంట ఎంతో ఆనందంగా ఉంటుందని అంతా భావించగా.. ఇలా జరగడంతో ఇరుకుటుంబాల మధ్య విషాదం నెలకొంది. వధువు కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.