నవ వధువు అపహరణ: అమ్మాయి బంధువులపై భర్త ఫిర్యాదు
హైదరాబాద్: హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు గౌతమి అపహరణకు గురైంది. అమ్మాయి తరపు బంధువులే అపహరించారని ఆమె భర్త శివకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, శివకృష్ణ, గౌతమిలు జులై 18న ఆర్య సమాజ్లో వివాహం చేసుకున్నారు.
తన భార్య కనిపించకపోవడంపై అనుమానాలు ఉన్నాయని శివకృష్ణ అన్నారు. తమకు తెలిసిన వారే కిడ్నాప్ చేసి వుంటారని ఆయన ఆరోపించారు. పోలీసులు స్పందించి వెంటనే తన భార్య ఆచూకీ తెలపాలని కోరారు. శివకృష్ణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
తాళం వేసి ఉన్న ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారితో పాటు నగరంలో చైన్స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి సుమారు రూ. 33 లక్షల విలువైన ఒక కిలో 160 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు, ఒక సాంత్రో కారు స్వాధీనం చేసుకున్నారు. వారిపై హైదరాబాద్లో ఎల్బీనగర్, కూకట్పల్లి, అంబర్పేట్, సరూర్నగర్, ఉస్మానియా యూనివర్సిటీ, నల్లకుంట పోలీస్ స్టేషన్లతో పాటు.. ఖమ్మం, సత్తుపల్లి , విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి.
వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాలతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా కడెం మండలం మద్దిపడగ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. గ్రామానికి చెందిన బైరి లక్ష్మి(25) బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం ఉదయం స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలతోనే లక్ష్మి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది.