ఇస్రో శాస్త్రవేత్త సురేష్ హత్య కేసులో కొత్త కోణం: మరో వ్యక్తితో శారీరక సంబంధమే ప్రాణం తీసిందా?
హైదరాబాద్: నగరంలోని అమీర్పేటలో సోమవారం రాత్రి జరిగిన ఇస్రోకు సంబంధించిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఎస్ఆర్సీ) శాస్త్రవేత్త సురేష్ కుమార్(56) హత్య కేసులో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆయనకు మరో వ్యక్తితో సంబంధం ఉందని, అతనే సోమవారం సురేష్ ఇంటికి వచ్చి హత్య చేసివుంటారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఇస్రో శాస్త్రవేత్త దారుణ హత్య, అసలేం జరిగింది?
వర్షంలో తడుచుకుంటూ ఇంటికి..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5-6గంటల ప్రాంతంలో సురేష్ కుమార్ అమీర్పేటలో తను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్లోని గదికి చేరుకున్నారు. ఆ సమయంలో వర్షం పడటంతో సురేష్ కుమార్ తడిచి వచ్చినట్లు వాచ్మెన్ చెప్పాడు. ఆ తర్వాత తన గదికి వెళ్లి తలుపులు వేసుకున్నాడు.
బయటి నుంచి తాళం..
మంగళవారం ఉదయం పనిమనిషి వచ్చి చూసే సరికి.. సురేష్ కుమార్ గదికి తాళం వేసి ఉండటంతో ఆమె వెనుదిరిగి వెళ్లిపోయింది. ఆ తర్వాత సురేష్ కుమార్కు ఆయన భార్య, పిల్లలు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. దీంతో వారు సురేష్ కుమార్ పనిచేసే కార్యాలయంలోని ఇతర ఉద్యోగులకు ఫోన్ చేశారు.
ఆందోళనతో భార్య చెన్నై నుంచి..
తన భర్త సురేష్ కుమార్ ఉండే గదికి వెళ్లిచూడమని సురేష్ కుమార్ భార్య ఇందిర ఓ ఉద్యోగికి చెప్పింది. దీంతో అతడు వెళ్లి చూసేసరికి గదికి తాళం వేసి ఉంది. ఈ విషయాన్ని అటు పోలీసులకు, ఇటు సురేష్ కుమార్ కుటుంబసభ్యులకు తెలిపాడు ఆ ఉద్యోగి. దీంతో సురేష్ కుమార్ కుటుంబసభ్యులు చెన్నై నుంచి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
రక్తపు మడుగులో..
పోలీసుల సమక్షంలో గదిని తెరిచి చూడగా.. అప్పటికే రక్తపు మడుగులో సురేష్ కుమార్ విగతజీవిగా పడివున్నాడు. తలపై బలమైన గాయాలయ్యాయి. సురేష్ మృతదేహాన్ని చూసిన భార్య, కుటుంబసభ్యులు భోరునవిలపించారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాలు లేవు.. తెలిసిన వ్యక్తి పనే..
అయితే, సురేష్ కుమార్ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, పూర్తి దర్యాప్తు చేసి త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని పోలీసు అధికారి తిరుపతన్న తెలిపారు. తెలిసిన వ్యక్తే సురేష్ కుమార్ను హత్య చేసివుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. సురేష్ కుమార్ తన కుటుంబంతో బాగానే ఉంటారని, వారి మధ్య ఎలాంటి కలహాలు లేవని చెప్పారు. సెలవులు వస్తే చెన్నైకి వెళ్లి కుటుంబాన్ని కలిసేవారని తెలిపారు.
శ్రీనివాస్ అనే వ్యక్తితో సంబంధం..?
సురేష్ కుమార్ భార్య ఫిర్యాదు మేరకే హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తిరుపతన్న తెలిపారు. ఇది ఇలా ఉండగా, సురేష్ కుమార్కు శ్రీనివాస్ అనే వ్యక్తితో శరీరక సంబంధం ఉందని సమాచారం. సోమవారం సాయంత్రం సురేష్ కుమార్ గదికి శ్రీనివాస్ వచ్చి వెళ్లినట్లు తెలుస్తోంది. అతనే సురేష్ కుమార్ ను హత్య చేసివుంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.