ముసలాడైనా బుద్ధి మారలేదు: యువతులతో వెకిలిచేష్టలు, అరెస్ట్ చేసిన షీ టీమ్స్
హైదరాబాద్: నగరంలో ఈవ్ టీజింగ్ నిరోధానికి పోలీసుయంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు. బుధవారం షీటీమ్స్ దాడులు నిర్వహించి వివిధ ప్రాంతాల్లో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న నలుగురిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. వీరిలో 71 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి కూడా ఉండటం గమనార్హం.
కోఠీ బస్టాప్ వద్ద ఉదయాన్నే వచ్చి యువతులు, విద్యార్థినులను తాకుతూ, వారి శరీర భాగాలను తడుముతూ ఆనందాన్ని పొందుతున్న నిజామాబాద్ జిల్లా అర్మూర్ మండలం వాల్మీకి నగర్కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి 71 ఏళ్ల మహమ్మద్ సాధిక్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న షీ టీమ్స్ బుధవారం అరెస్ట్ చేశాయి.
అతడి విన్యాసాలను రికార్డు చేసిన అనంతరం అదుపులోకి తీసుకుని విచారించారు. హైదరాబాద్లో తన బంధువుల ఇంటికి తరచూ వస్తుంటానని, ఈ క్రమంలో ఇలా చేస్తుంటానని వెల్లడించాడు. నిందితుడ్ని న్యాయమూర్తి ముందు హాజరుపర్చగా రెండు రోజులపాటు జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
మరో ఘటనలో గత ఆరునెలలుగా ఓ మహిళను వేధిస్తున్న ఓల్డ్మలక్పేటకు చెందిన బి రాములును అఫ్జల్గంజ్ బస్టాండ్లో షీటీమ్ సభ్యులు అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా, ఐదు రోజుల కస్టడీ విధించారు.
వీరితోపాటు మహిళలను వేధిస్తున్న మెదక్ జిల్లా రామచంద్రపురం కొల్లూరు గ్రామానికి చెందిన మహమ్మద్ మోసిన్, మెహిదీపట్నంలో ఉంటున్న బీహర్కు మహమ్మద్ ఇస్తియాక్లను ఆధారాలతో సహా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు.