'ఎమ్మెల్సీ' ఫోటోల తారుమారు: చిన్న నిర్లక్ష్యానికి కోటిన్నర మూల్యం!
అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు కావడంతో.. కోటిన్నర రూపాయాల ప్రజాధనం వృథా కానుంది.
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోటోల తారుమారు వ్యవహారం కోటిన్నర భారీ మూల్యానికి తెరదీసింది. అధికారులు చేసిన చిన్న పొరపాటు వల్ల నిన్నటి మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు కావడంతో.. కోటిన్నర రూపాయాల ప్రజాధనం వృథా కానుంది.
ఓట్లేసిన ఉపాధ్యాయులు, అధికారులు, ఎన్నికల యంత్రాంగమంతా మరోసారి ఎన్నికల కసరత్తు చేయాల్సి వస్తోంది. ఎన్నిక రద్దును రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ గురువారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు. రద్దుపై వివరణ ఇచ్చారు. వాస్తవానికి తొలి ప్రూఫ్ లో బ్యాలెట్ సక్రమంగానే ఉందని, చివరికి వచ్చే సరికి ఫోటోలు తారుమారయ్యాయని ఆయన అన్నారు.
బ్యాలెట్ ముద్రించిన తర్వాత నోడల్ అధికారిగా ఉన్న రమేష్ దాన్ని పరిశీలించినందువల్లే ఈ తప్పు జరిగిందని ఈసీ ప్రాథమిక అంచనాకు వచ్చింది. ఎన్నికల కసరత్తు కోసం శ్రమించిన సిబ్బందికి.. మరోసారి ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో.. వారందరికీ మరొకసారి వేతనాలు చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
దాదాపు మూడు జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన 126పోలింగ్ కేంద్రాల్లో 50వేల మంది సిబ్బంధి విధులు నిర్వర్తించారు. వీరంతా మరోసారి ఎన్నికల కసరత్తు కోసం శ్రమించాల్సి ఉంది. ఫోటోల తారమారు వెనుక రాజకీయ కోణమేమైనా ఉందా? అన్న ఆరోపణలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ నెల 19న మరోసారి ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహిస్తామని ఈసీ ప్రకటించడంతో.. అదేరోజు నిర్వహించాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం గణితం, జంతుశాస్త్రం, చరిత్ర పరీక్షలు మరోసారి వాయిదా పడుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమైంది.
నిజానికి ఈ పరీక్షలను ఈ నెల 9న నిర్వహించాల్సి ఉన్నా.. ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా 19కి పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు మళ్లీ నిర్వహించాల్సి రావడంతో పరీక్ష మరోసారి రద్దవుతుందేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే అలాంటిదేమి లేదని పరీక్షలు 19వ తేదీన యథాతథంగా జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.