Viral Video : ఆ తల్లి ఔదార్యానికి సలాం.. పోలీసుల పట్ల పేద మహిళ గొప్ప మనసు
కరోనాపై చేస్తున్న యుద్ధంలో ఇటీవల ఓ బీడీ కార్మికురాలు సైతం తనవంతుగా రూ.20వేలను తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్కు అందజేసిన సంగతి తెలిసిందే. ఒక బీడీ కార్మికురాలు.. తనకొచ్చే అతికొద్ది ఆదాయంలో బతుకుతూ.. తను దాచుకున్న డబ్బును సమాజం కోసం ఇవ్వడంపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి విపత్కర సమయంలో ఆమె లాంటి విశాల దృక్పథం ఉన్న మనషులే సమాజానికి అవసరమంటూ సీఎం కేసీఆర్ సైతం ప్రశంసించారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా తుని పట్టణంలోనూ ఓ పేద మహిళ కూడా తన ఔదార్యాన్ని చాటుకుంది. ఆమె వీడియోను ప్రముఖ నటుడు మాధవన్ సైతం తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం విశేషం.
Recommended Video
లాక్ డౌన్ వేళ విధులు నిర్వహిస్తున్న పోలీసుల వద్దకు వెళ్లిన ఓ మహిళ.. రెండు లీటర్ల థమ్సప్, ఫాంటా బాటిళ్లను వారికి అందజేసింది. ఎండలో ప్రజల కోసం కష్టపడుతున్నందుకు తనవంతుగా ఈ సాయం చేస్తున్నానని.. వీటిని సేవించాలని కోరింది. ఒక సాధారణ మహిళ తమ పట్ల ఇంత గొప్ప మనసు చాటుకోవడంపై పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు.
దైవం మనుష్య రూపేణా pic.twitter.com/GUACMVtIrI
— .... (@ynakg2) April 15, 2020
ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు. తాను ఒక ఆయాగా పనిచేస్తున్నానని.. నెలకు రూ.3500 సంపాదిస్తానని చెప్పింది. దీంతో పోలీసులు ఆమె ఔదార్యానికి మరింత ఆశ్చర్యపోయారు. తక్కువ జీతంతోనే జీవనం సాగిస్తున్నప్పటికీ.. తమకు సాయం చేయాలనుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు.
అంతేకాదు, ఆ కూల్ డ్రింక్స్ బాటిళ్లను సున్నితంగా తిరస్కరించి.. ఇంట్లో వాళ్లకు తీసుకెళ్లండని సూచించారు. తమ వద్ద ఉన్న కొన్ని ఫ్రూటీ బాటిళ్లను కూడా ఆమె సంచిలో వేశారు.ఈ వీడియోను ఎవరో ట్విట్టర్లో షేర్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది మాధవన్ దృష్టికి రావడంతో ఆయన కూడా తన ట్విట్టర్లో షేర్ చేశారు. 'ఏమి చేయగలం.. ఏమి మాట్లాడగలం.. దేవుడు ఆమెను చల్లగా చూడాలి..' అని పేర్కొన్నారు. ఒక పేద మహిళ అయినప్పటికీ పోలీసుల కష్టం చూడలేక ఇలా సాయం చేయడానికి ముందుకు రావడంపై నెటిజెన్స్ ఆ తల్లిని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.