ఫినాయిల్ తాగి ఖైదీ ఆత్మహత్య: అదృశ్యమైన యువతులు మృతి
చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జిల్లా కారాగారంలో చోటుచేసుకుంది.
సంగారెడ్డి: చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఫినాయిల్ తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని జిల్లా కారాగారంలో చోటుచేసుకుంది. జిల్లా జైలు పర్యవేక్షకులు సంతోష్కుమార్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం ... సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగారం గ్రామానికి చెందిన కరుణాకర్ (20) అనే ఖైదీకి 2016 సంవత్సరంలో చోరీ కేసులో శిక్ష పడింది.
అయితే అప్పుడు ఇక్కడి పోలీసులు చర్లపల్ల కారాగారానికి తరలించారు. అనంతరం కరుణాకర్ను తిరిగి 2016లో చర్లపల్లి జైలు అధికారులు కంది జిల్లా జైలుకు పంపించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం కరుణాకర్ ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
గమనించిన తోటి ఖైదీలు విషయాన్ని అధికారులకు సమాచారం అందించారు. దీంతో జైలు అధికారులు అతనిని సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్ మృతి చెందాడని సంతోష్కుమార్ రాయ్ తెలిపారు.
కాకతీయ కాలువలో అదృశ్యమైన యువతుల మృతదేహాల లభ్యం
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం గట్టుదుద్దెనపల్లి గ్రామంలో ఇద్దరు విద్యార్థినులు అదృశ్యం మిస్టరీ వీడింది. కాకతీయ కాలువలో బట్టలు ఉతికేందుకు వెళ్లిన విద్యార్థినులు కాలువలో శవాలై తేలారు. దీంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన అఖిల(16), ప్రత్యూష (15) వరుసకు అక్కాచెల్లెళ్లు. ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. జనవరి 8న ఆదివారం పాఠశాలకు సెలవు దినం కావడంతో ఇద్దరూ కలిసి కాకతీయ కాలువలో బట్టలు ఉతికేందుకు వెళ్లారు. ఆ తరువాత ఇంటికి వచ్చి మళ్లీ కాలువ వైపుకు వెళ్లి రాత్రి వరకు తిరిగి రాలేదు. దీంతో ఇద్దరి కుంటుబసభ్యులు ఆందోళనకు గురయ్యారు.
బట్టలు ఇంటి వద్దే ఉండటంతో వీరి అదృశ్యంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. చేసేదిలేక సోమవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు గట్టుదుద్దెనపల్లికి చేరుకొని విద్యార్థుల కోసం గాలింపు ముమ్మరం చేశారు. కాకతీయ కాలువలో నీటి సరఫరా ఉధృతంగా ఉండడంతో కాలువ నీటిని నిలిపివేయించి గాలించగా సోమవారం రాత్రి ప్రత్యూష మృతదేహం లభ్యమైంది. మంగళవారం అఖిల మృతదేహం హుజూరాబాద్ సమీపంలోని పెద్దపాపయ్యపల్లి గ్రామ సమీపంలో కాలువలో లభ్యమైనట్లు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు.
మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుల చేస్తున్నట్లు తెలిపారు. బాధితుల కుటుంబ సభ్యులను ప్రభుత్వాస్పత్రి వద్ద ఎమ్మెల్యే పరామర్శించారు.
కొడుకును గొడ్డలితో నరికిన తండ్రి
కొత్తగూడెం భద్రాద్రి: కొడుకును గొడ్డలితో తండ్రి నరికిన సంఘటన భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని అల్లూరిసెంటర్లో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాల ప్రకారం.. పట్టణ పరిధి బొల్లోరిగూడెంలో నివాసముంటున్న గడ్డం పుల్లయ్య, నాగమణిలకు ముగ్గురు కుమారులు.
పెద్ద కుమారుడు రవికుమార్ (33)తో కలిసి స్థానిక అల్లూరిసెంటర్లో చికెన్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తండ్రి పుల్లయ్య మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో మంగళవారం డబ్బులివ్వాలని కొడుకుని అడగ్గా రూ. 600 ఇచ్చాడు. వాటితో పూటుగా మద్యం తాగి వచ్చిన తండ్రి.. ఇంకా డబ్బులు కావాలని అడగడంతో డబ్బులు ఇవ్వడానికి అతడు నిరాకరించాడు.
దీంతో ఇంట్లో ఉన్న గొడ్డలిని తీసుకొచ్చి రవికుమార్ ముఖంపై నరకగా తీవ్ర గాయాలపాలయ్యాడు. వెంటనే రవికుమార్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురు కుమారుల్లో పెద్దవాడు రవికుమార్కు ఇంకా వివాహం కాలేదు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
వరంగల్ రూరల్ జిల్లా పున్నేలు క్రాస్రోడ్డు వద్ద బుధవారం రోజున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు రైతులు చనిపోగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. పాలకుర్తి నుండి గోనెసంచుల్లో పత్తి తీసుకొని ఆటోలో వస్తుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం వ్యాను ఢీకొనగా ఇద్దరు రైతులు అక్కడికక్కడే చనిపోయారు. ఐనవోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం ఎదురెదురుగా రెండు వాహనాలు ఢీకొనగా ఇద్దరు రైతులు చనిపోయారు. చనిపోయినవారిలో పాలకుర్తికి చెందిన బాదావత్ భోజ్యా(60), గుగులోతు బిచ్చు(40)గా గుర్తించారు. గాయాలైన మిగతా ముగ్గురిని వరంగల్లోని ఎంజీఎంకు తరలించామని పోలీసులు తెలిపారు. ఐనవోలు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.