జీడిమెట్ల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలు
హైదరాబాద్: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ శబ్ధంతో పేలుడు ఘటన కలకలం రేపింది. జీవిక లైఫ్ అనే ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడుతో కంపెనీ పైకప్పు తునాతునకలైంది. ఈ పేలుడు ఘటనలో ఇద్దరురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. మృతుల్లో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. పేలుడుతో ఎగిసిపడిన మంటలను అగ్నిమాపక దళాలు అదుపులోకి తీసుకొచ్చాయి.
కాగా, ప్రమాద సమయంలో పరిశ్రమలో మొత్తం 20మంది కార్మికులు పనిచేస్తున్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయంపై వివరాలు తెలియాల్సి ఉంది.
గతంలో కూడా ఇలాంటి ఘటనలు జీడిమెట్ల పారిశ్రామిక వాడలో చోటు చేసుకున్నప్పటికీ అక్కడి కంపెనీలు, పరిశ్రమలు సరైన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలున్నాయి. తరచూ జీడిమెట్ల పారిశ్రామిక వాడలో ఇలాంటి ప్రమాదాలు జరగడంపై అక్కడి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని కోరుతున్నారు.
ఆటోను డీకొన్న కారు: ఐదుగురు మృతి
నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎడపల్లి మండలం రాణాకలాన్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందారు. ఎదురెదురుగా వస్తున్న కారు-ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా కారు ఢీకొనడటంతో ఆటోలోని ఓ ప్రయాణికుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
మరో ముగ్గురు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మృతుల్లో జక్కం బాలమణి, జక్కం గంగమ్మ, కల్లేపురం సాయిలు, చిక్కెల సాయిలు, ఆటో డ్రైవర్ నయీం ఉన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.