అప్పటి దాకా సైలెన్స్: ఓ వైపు సీనియర్లతో రేవంత్, ఇక విజయశాంతి ప్రచారం
కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కావొచ్చుననే ప్రచారం సాగుతోంది.
Recommended Video
హైదరాబాద్: కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి త్వరలో పాదయాత్ర చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. చేవెళ్ల నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభం కావొచ్చుననే ప్రచారం సాగుతోంది.
వేడెక్కించిన రేవంత్ నిర్ణయాలు: ఆయన అసెంబ్లీ లాబీల్లో చర్చ ఇలా
చేవెళ్లలో రేవంత్కు మంచి ఫాలోయింగ్ ఉందని, వారంతా ఇక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభించాలని కోరుతున్నారని తెలుస్తోంది. మరోవైపు, రేవంత్ మంగళవారం మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత సర్వే సత్యనారాయణను కలిశారు.
కాంగ్రెస్ నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి
సర్వే సత్యనారాయణ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్లోని ఆయన నివాసం వద్ద మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ పాల్గొన్నారు.
రేవంత్ను పరిచయం చేసుకున్న నాయకులు
ఈ సందర్భంగా మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు రేవంత్ రెడ్డిని పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై మండిపడిన విషయం తెలిసిందే.
ఆ పదవితో కాంగ్రెస్ నాయకుడిగా జనాల్లోకి
ఇదిలా ఉండగా రేవంత్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం ఆ పార్టీ నాయకుడి హోదాలో ఏ అధికార కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ఆయన సీనియర్ నేతలను కలుస్తున్నారు. అందరిని కలిసి, అధిష్టానం నుంచి తనకు పదవి వచ్చిన తర్వాత ఆయన కాంగ్రెస్ నాయకుడిగా జనాల్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
దానిపైనే రేవంత్ దృష్టి
ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై శాసన సభలో, బయట విరుచుకుపడుతోంది. రేవంత్ కూడా తోడైతే మరింత బలంగా ఉంటుందని భావిస్తున్నారు. కానీ ఆయన మాత్రం కాంగ్రెస్లోని సీనియర్ల మద్దతు కూడగట్టుకోవడం పైనే దృష్టి సారించారు.
రేవంత్ వ్యూహాత్మకంగానే
రేవంత్ కాంగ్రెస్ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అలాగని మౌనంగా ఉండటం లేదు. నేతలను కలుస్తున్నారు. తద్వారా తన వ్యూహంలో భాగంగా పదవి ఇచ్చే వరకు ఇలాగే ఉంటారా, లేదా చూడాలనే చర్చ సాగుతోంది.
రాహుల్ గాంధీతో విజయశాంతి
మరోవైపు, మాజీ ఎంపీ విజయశాంతి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా కనిపించని విజయశాంతి ఇప్పుడు రాహుల్తో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకొంది. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ కుంతియా పాల్గొన్నారు.
సామాన్య కార్యకర్తలా విజయశాంతి
ఈ నెలలో వరంగల్లో తలపెట్టిన బహిరంగ సభ, పార్టీలో చేరికలు, టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన తదితర అంశాలపై చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సమావేశం అనంతరం కుంతియా విలేకర్లతో మాట్లాడారు. పార్టీ కోసం సామన్య కార్యకర్తలా కష్టపడతానని విజయశాంతి చెప్పినట్లు తెలిపారు.
పార్టీ కోసం విజయశాంతి ప్రచారం
ఇక నుంచి ఆమె తెలంగాణ కాంగ్రెస్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తెలంగాణలో పార్టీ కోసం ప్రచారం చేస్తారన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయని, రాహుల్ నేతృత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతోందన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా అధికారం చేపడుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.