టీఎస్ఆర్టీసీ సకల జనుల సమరభేరీలో విషాదం: డ్రైవర్ మృతి
హైదరాబాద్: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ టీఎస్ఆర్టీసీ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించిన సకల జనుల సమరభేరి సభలో విషాదం చోటు చేసుకుంది. సభకు హాజరైన ఒక డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు.
మృతుడు కరీంనగర్ డిపోకి చెందిన డ్రైవర్ బాబుగా గుర్తించారు. గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో ఆయన పాల్గొంటున్నారు. బుధవారం సరూర్నగర్లో జరిగిన సకల జనుల సమర భేరి సభలో పాల్గొన్నారు. తిరిగి కరీంనగర్ వెళుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో బాబు మృతి చెందారు. ఇప్పటికే సమ్మె నేపథ్యంలో పలువురు కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు.
జగన్ సర్కారు నిర్ణయం తెలంగాణలోనూ అమలు కావాలి కాదా?: కేసీఆర్ గుండెలు అదరాలంటూ రేవంత్
కాగా, ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాల్సిందేనని.. సకల జనుల సమర భేరి తీర్మానించింది. ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా నుంచి భారీ ఎత్తున కార్మికులు తరలివచ్చారు. కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాలు, విపక్ష నేతలు హాజరై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
26రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులకు నేతలంతా సంఘీభావం ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిద్దామని, అప్పటి వరకు కార్మికులకు అండగా తాము ఉంటామని నేతలు సభలో స్పష్టం చేశారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బుధవారం సాయంత్రం 6గంటలకే సభను ముగించారు. కాగా, గురువారం మధ్యాహ్నం నుంచి 24 గంటల దీక్షకు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. త్వరలో ఆర్టీసీ కార్మికుల మిలియన్ మార్చ్ ఉంటుందని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. అవసరమైతే ట్యాంక్ బండ్ మీదే మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని అన్నారు.