అజిత్ ధోవల్ సూచనలతోనే: రెండేళ్ల కిందటే ఏ-శాట్ ప్రాజెక్ట్ మొదలు! డీఆర్డీఓ ఛైర్మన్
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన అంతరిక్ష ప్రయోగం.. మిషన్ శక్తి. భూకక్ష్యలో పరిభ్రమించే ఉపగ్రహాలను పేల్చి పడేయగల శక్తి సామర్థ్యాలు ఉన్న క్షిపణిని తయారు చేసిన భారత్.. అంతరిక్షంలో ప్రయోగాల్లో సూపర్ పవర్ గా ఎదిగింది. మనదేశం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ శక్తికి కావాల్సిన శక్తి సామార్థ్యాలను అందించినది రక్షణ, పరిశోధనాభివృద్ధి సంస్థ..డీఆర్ఢీఓ. ఈ సంస్థ ఛైర్మన్ జీ సతీష్ రెడ్డి. మన తెలుగువారే. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలను ఆయన ఏఎన్ఐ ఏజెన్సీతో పంచుకున్నారు.
రెండేళ్ల కిందటే ప్రాజెక్టు పనులు ఆరంభం..
మిషన్ శక్తికి కావాల్సిన పనులను రెండేళ్ల కిందటే ఆరంభించినట్లు సతీష్ రెడ్డి తెలిపారు. క్షిపణిని ఆరు నెలల రికార్డు సమయంలో తయారు చేసినట్లు చెప్పారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ ధోవల్ సూచలన మేరకు మిషన్ శక్తి ప్రాజెక్టును చేపట్టామని అన్నారు. ఆరు నెలల పాటు వందమందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటల పాటూ ఈ ప్రాజెక్టు కోసం పని చేశారని అన్నారు. 300 కిలోమీటర్ల లోపే ఉన్న పరిధిని ఎంచుకోవడానికి కూడా కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయని సతీష్ రెడ్డి తెలిపారు. రక్షణ సలహాదారుడైనందున.. తాము వ్యూహాత్మకంగా అజిత్ ధోవల్ కు అన్ని విషయాలను తెలియజేయాల్సి ఉంటుందని సతీష్ రెడ్డి ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.
అంతరిక్షంలో ఇప్పటిదాకా ప్రయోగించిన ఆస్తులన్నీ జాతీయపరమైనవని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఉపగ్రహాలను పేల్చేసిన తరువాత వెలువడే శకలాలు భూమిపై పడకుండా చూడాలన్న ఉద్దేశంతోనే.. వినూత్న ప్రయోగం చేశామని అన్నారు. శకలాలు భూమికి చేరకూడదనే కారణంతో క్షిపణి రేంజ్ 300 కిలోమీటర్ల లోపు ఉండేలా..లో ఎర్త్ ఆర్బిట్ ను ఎంచుకున్నట్లు చెప్పారు.
లక్ష్యాన్ని నేరుగా ఛేదించేలా క్షిపణి
భూకక్ష్యలో ప్రయోగించిన ఉపగ్రహాలు అతి వేగంగా పరిభ్రమిస్తున్నప్పటికీ.. వాటిని వెంటాడి, నేరుగా ఛేదించేలా క్షిపణిని తయారు చేశామని, అందుకే ఈ క్షిపణికి కైనెటిక్ కిల్ అని పిలుస్తున్నట్లు సతీష్ రెడ్డి వెల్లడించారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించామని, ఎలాంటి ఎర్రర్ లేకుండా అన్ని జాగ్తత్తలు తీసుకున్నామని అన్నారు.
ఒడిశాలోని బాలాసోర్ నుంచి క్షిపణిని ప్రయోగించిన కేవలం మూడు నిమిషాల వ్యవధిలో.. 300 కిలోమీటర్ల ఎత్తు వరకు దూసుకెళ్లడం ఒక ఎత్తయితే..అంతే వేగంతో నేరుగా లక్ష్యాన్ని ఛేదించడం మరో ఎత్తు అని చెప్పారు. 300 కిలోమీటర్ల వరకు లక్ష్యాన్ని ఛేదించినప్పటికీ.. క్షిపణి పరిధి మాత్రం విస్తృతమైనదని అన్నారు. దాని వాస్తవ రేంజ్ 1000 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉందని అన్నారు. భూ ఉపరితలం నుంచి 1000 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే ఉపగ్రహాన్ని కూడా కూల్చేయగల సామర్థ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు.