పంద్రాగస్టు విషాదం: నలుగురు విద్యార్థులను కాపాడి మహిళా హెచ్ఎం మృతి
రంగారెడ్డి: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పాఠశాలలో జెండా పైపును ఏర్పాటు చేస్తున్న సమయంలో ప్రమాద వశాత్తు విద్యుత్ షాక్ తగిలి ప్రధానోపాధ్యాయురాలు మృతి చెందగా, నలుగురు విద్యార్థులకు గాయాలయ్యాయి. జెండా పైపునకు విద్యుత్ తీగ తగిలిన విషయాన్ని గమనించిన హెచ్ఎం.. విద్యార్థులను తోసేసింది. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోగా, విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా చన్గోమూల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మేడికొండ గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో పెద్ద ఉమ్మాంతాల్ గ్రామానికి చెందిన కలువ ప్రభావతి (40) ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. సోమవారం జరిగే స్వాతంత్య్ర దినోత్సవం వేడుకల కోసం ఏర్పాట్లు చేసేందుకు ఆమె ఆదివారం పాఠశాలకు వచ్చారు.
ప్రధానోపాధ్యాయురాలు వచ్చిన విషయం తెలుసుకుని గ్రామంలోని విద్యార్థులు పనులలో పాల్గొనేందుకు పాఠశాలకు వచ్చారు. పాఠశాలలో ఉన్న జాతీయ జెండాను విద్యార్థుల సాయంతో బయటకు తీశారు. జెండా పైపు దిమ్మలో సరిగా పడుతుందా? లేదా? అనే విషయం నిర్దారించుకోవడానికి దిమ్మలో జెండా పైపును పెట్టే సమయంలో పైపు బ్యాలెన్స్ తప్పి పైన ఉన్న విద్యుత్ తీగలకు తగిలింది.
జెండా పైపును పట్టుకున్న ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి విద్యుత్ షాక్తో అక్కడికక్కడే మృతి చెందా రు. కాగా, అంతకుముందు విషయాన్ని గమనించిన ఆమె పక్కనే ఉన్న నలుగురు విద్యార్థులు కీర్తన, శివతేజ, గణేష్, మధుప్రియలను పక్కకు తోసేసింది. దీంతో వారు స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డారు.
ఈ విషయాన్ని గమనించిన గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు వారిని చికిత్స నిమిత్తం వికారాబాద్ ఆస్పపత్రికి తరలించారు. ఆస్పత్రిలో ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతిని పరీక్షించిన డాక్టర్ అప్పటికే ఆమె మృతి చెందినట్లు చెప్పారు. విద్యుత్ షాక్కు గురైన నలుగురు విద్యార్థులకు చికిత్స నిర్వహించారు.
సమాచారం అందుకున్న టిఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి ఆస్పత్రికి వచ్చి సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ప్రభావతి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.
మృతురాలు భర్త రాజారెడ్డి ఫిర్యాదు మేరకు చన్గోమూల్ ఎస్ఐ యాదయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. కాగా, ఘటనపై చర్యలు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విద్యుత్ శాఖ నుంచి రూ. 30లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరాయి.