ఒక సీటు..! పోటీ పడుతున్న మూడు పార్టీలు..! కూటమిలో ఆ సీటుపై మహా చర్చలు..!!
హైదరాబాద్: మహాకూటమిలో పార్టీల మద్య జెండా ఎజెండా ఎకమైనా సీట్ల సర్దుబాటులో మాత్రం ఏకాభిప్రాయం కుదరడం లేదు. కొన్ని తటస్థ నియోజక వర్గాల్లో సీట్లను మహాకూటమిలోని అన్ని పార్టీలు ఆశిస్తుండడంతో సమస్య మొదటికి వస్తోంది. దీంతో సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కి రావడానికి కూటమిలో మరికొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి కొత్తగూడెం స్థానాన్ని మహాకూటమిలోని మూడు పార్టీలు తమకంటే తమకు కావాలనండంతో దానిమీద పెద్దయెత్తున చర్చలు జరుగుతున్నాయి. చివరకు ఆ స్థానం ఎవరికి కేటాయింబడుతుందో అనే అంశం పై మాత్రం ఉత్కంఠ నెలకొంది.
టీఆర్ఎస్ ని గద్దె దించడానికి అందరూ ఒక్కటయ్యారు..! ఒక్క సీటుకోసం మాత్రం పట్టుబడుతున్నారు..!!
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విపక్షాలు అన్నీ మహాకూటమి దిశగా అడుగులు వేశాయి. రాష్ట్రంలో గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుటికి బాగా బలపడిన కాంగ్రెస్ పార్టీ మహాకూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది. తెలుగుదేశం పార్టీ ప్రయత్నాలు కూడా కూటమి ఏర్పడడానికి ఉపయోగపడ్డాయి. ఈ రెండు పార్టీలతో పాటు తెలంగాణ జనసమితి, సీపీఐ, తెలంగాణ ఇంటి పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చి మహాకూటమిగా ఏర్పడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించడమే తమ లక్ష్యమని తెలంగాణలో ఏర్పాటు అయిన మహాకూటమి స్పష్టం చేసింది.
కూటమిలో అంతా ఓకే..! ఆ నియోజకవర్గం తప్ప..!!
ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ కూటమి, సీట్ల సర్ధుబాటు కూడా పూర్తయిన వెంటనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడనుంది. ఇందులో భాగంగా కూటమిలోని పార్టీలన్నీ కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. అన్ని పార్టీలు ఏకమై ఒకే మేనిఫెస్టోను రూపొందించాలని డిసైడ్ అయ్యాయి. అలాగే ఇతర పార్టీలను కూడా కలుపుకుని ఒకే మేనిఫెస్టో రూపొందించి బహిరంగ సభలను నిర్వహించాలని చర్చించినట్లు తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూటమిలో ఓ అసెంబ్లీ స్థానం చిచ్చు పెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
కొత్తగూడెం పై కన్నేసిన మూడు పార్టీలు..! సీటు మాత్రం ఎవరికో..!!
ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో కీలక స్థానమైన కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గంపై కూటమిలోని మూడు పార్టీలు కన్నేసినట్లు తెలుస్తోంది. ఇదే ఆ పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి కారణమని సమాచారం. ప్రస్తుతం టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న కొత్తగూడెంలో గత ఎన్నికల్లో జలగం వెంకట్రావు విజయం సాధించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ సాధించిన ఏకైక సీటు కూడా ఇదే. ఇప్పుడు ఇక్కడ జెండా ఎగురవేయాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ భావిస్తున్నాయి. అందుకోసమే ఈ స్థానం కోసం పట్టుబడుతున్నాయి.
మహాకూటమిలో ఈ స్థానంపై తీవ్ర స్థాయిలో చర్చ..! కొలిక్కి వచ్చేనా..!!
1978 నుంచి ఇప్పటి వరకు తొమ్మది సార్లు ఇక్కడ ఎన్నికలు జరగగా, కాంగ్రెస్ మూడు సార్లు, టీడీపీ రెండు సార్లు, సీపీఐ, టీఆర్ఎస్ ఒకసారి రెండు సార్లు స్వతంత్ర అభ్యర్ధులు విజయం సాధించారు. దీంతో ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర్రావు, టీడీపీ తరపున సీనియర్ నేత కోనేరు నాగేశ్వర్రావు కుమారుడు చిన్ని, సీపీఐ తరపున కూనంనేని సాంబశివరావు టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో వనమా అక్కడ మూడు సార్లు విజయం సాధించానని అందుకే తనకు టికెట్ ఇవ్వాలని కోరుతుండగా, టీడీపీ నేత తన తండ్రి పేరు చెప్పుకుంటున్నారు. ఇక కూనంనేని కూడా ఒకసారి విజయం సాధించడంతో టికెట్ కావాలంటున్నారు. అందుకే మహాకూటమిలో ఈ స్థానంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.