సీజ్ చేసిన బీజేపీ 8కోట్ల నగదుకు ఐటీ క్లీన్ చిట్ .. కేసు నమోదుపై పోలీసుల తర్జనభర్జన
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్లో టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్న ఎనిమిది కోట్ల రూపాయల వివాదం కలకలం రేపుతోంది. ఇక తాజాగా ఈ నగదుకు క్లీన్ చిట్ ఇస్తూ ఆదాయపన్ను శాఖ ప్రకటన చేసింది. అయితే ఈ వ్యవహారంలో ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందా లేదా అనేది చట్టపరమైన సలహా తీసుకోవాలని పోలీసులు ఆలోచిస్తున్నారు.
కూకట్ పల్లి ఓటర్లు టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారా ? షాకిస్తారా ?
8 కోట్ల బీజేపీ నగదుపై కేసు నమోదు చెయ్యని పోలీసులు
సోమవారం భారతీయ జనతా పార్టీకి చెందిన రూ. 8 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్సు పోలీసులు. ఈ నగదును బిజెపి ఖాతా నుండి లక్ష్మణ్ పేరు మీద విత్ డ్రా చేసినట్లుగా నారాయణగూడలోని ఇండియన్ బ్యాంకు నుంచి ఈ నగదును తీసుకున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో పక్కా వ్యూహంతో ఈ నగదు ను పట్టుకున్నారు పోలీసులు. బిజెపి రాష్ట్రాధ్యక్షుడి ఆదేశాల మేరకు డబ్బులు డ్రా చేశామని రూ.2 కోట్లతో దొరికిన ప్రదీప్రెడ్డి పోలీసులకు చెప్పినట్లు సమాచారం. డబ్బు డ్రా చేసిన చెక్కు పైన బిజెపి ఖాతా నంబరు, లక్ష్మణ్ సంతకం ఉంది.
8కోట్ల నగదుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఆదాయపు పన్ను శాఖ
ఇక పట్టుకున్న ఆ డబ్బును ఆదాయ పన్నుశాఖ కార్యాలయానికి తరలించారు. కాగా అక్కడ స్థలం లేదని తిరిగి ఆదాయపు పన్ను శాఖ నగదు అక్కడ పెట్టటానికి నిరాకరించింది . ఆ నగదు విషయంలో ఆదాయపన్ను శాఖ లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయంటూ క్లీన్ చిట్ ఇచ్చింది.అయితే బ్యాంక్ అధికారులు ఇంత నగదును ఒకేసారి ఇవ్వడంపై ప్రజల నుండి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
బ్యాంకుల తీరుపై ప్రజల ఆగ్రహం .. ఒకేసారి అంత నగదును ఇవ్వటంపై విమర్శలు
ఎందుకంటే నగదు లావాదేవీలను బ్యాంకులు ప్రోత్సహించడం లేదు. పొరపాటున ఎవరైనా ఎక్కువ నగదు విత్ డ్రా చెయ్యాలి అనుకుంటే లక్ష రూల్స్ చెప్పి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్న బ్యాంకులు, ఒక రాజకీయ పార్టీ అడిగిన తడవునే ఒకేసారిగా 8 కోట్ల నగదు ఇవ్వడంపై సర్వత్రా పెద్ద దుమారమే రేపుతోంది. ఈ విషయంపై సదరు బ్యాంకు వివరణ ఇస్తూ 'ఇదేం కొత్తగా కాదు. బిజెపి ఖాతా మా బ్యాంకులోనే ఉంది. పార్టీకి అవసరమైనప్పుడు డబ్బులు డ్రా చేసి తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఆ పార్టీ అధ్యక్షుడు సంతకం చేసిన చెక్కు ఉండటంతోనే ఇంత పెద్దమొత్తం డబ్బు ఇచ్చాం' అని బ్యాంకు అధికారులు పేర్కొన్నారు.
నగదు లావాదేవీలు రాజకీయనాయకులకు కోట్లలో అయినా ఓకే అంటున్న బ్యాంకులు
సామాన్యుడు లక్షల్లో డ్రా చేసుకోవాలంటేనే ముప్పతిప్పలు పెట్టే బ్యాంకులు రాజకీయ పార్టీలకు మాత్రం కోట్లలో నగదు విత్ డ్రా చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాయి.
అయితే బిజెపి విత్ డ్రా చేసిన ఎనిమిది కోట్ల రూపాయలు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన కిషన్ రెడ్డి గెలుపు కోసం సికింద్రాబాద్ నియోజకవర్గంలో డబ్బులు పంచడానికి అని టిఆర్ఎస్ ఆరోపించింది. అయితే అలాంటిదేమీ లేదని, ఎన్నికల సందర్భంగా నిర్వహించిన సభలు సమావేశాలు ఖర్చులు చెల్లించడం కోసం విత్ డ్రా చేశామని బిజెపి రాష్ట్ర అధినాయకత్వం చెబుతోంది.
కేసు నమోదు చెయ్యాలా వద్దా .. లీగల్ ఒపీనియన్ తీసుకోనున్న పోలీసులు
ఏదేమైనప్పటికీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో బిజెపి వంటి జాతీయ పార్టీ కోట్ల రూపాయల నగదు విత్ డ్రా చేయడం సంచలనంగా మారింది. ఈ నగదు విషయంలో ఇప్పటివరకు కేసు నమోదు కాని నేపథ్యంలో, లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించారు పోలీసులు.