మల్కాజ్గిరి కోర్టు సమీపంలో ఘోరం: ‘టెక్కీ’ బావను నరికి చంపారు
మేడ్చల్: మల్కాజ్గిరి కోర్టు సమీపంలో శుక్రవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. కోర్టులో కుటుంబ కలహాల కేసు విషయమై హాజరయ్యేందుకు వచ్చిన చందర్ అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ను అతని బావమరుదులే దారుణంగా కత్తులతో నరికి చంపారు.
మూడేళ్ల క్రితం చందర్కు మాల్కాజ్గిరికి చెందిన సుహాసినితో వివాహం జరిగింది. అయితే రెండేళ్లుగా వారిద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో సుహాసిని తన భర్త చందర్పై కేసు పెట్టడంతో విడాకుల వివాదం కోర్టులో నడుస్తోంది.
ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం కోర్టుకు హాజరై కారులో వెళ్తుండగా.. మాట్లాడుతామని బయటికి పిలిచారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి, నరికి చంపారు. కాగా, తన కుమారుడైన బావమరుదులు వినయ్, విఘ్నేష్లే ఈ దారుణానికి పాల్పడ్డారని చందర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
రెండేళ్లుగా తన కొడుకును చంపేందుకు ప్రయత్నిస్తున్నారని చందర్ తండ్రి చెప్పారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కుటుంబకలహాల కారణంగానే ఈ హత్య జరిగివుంటుందని పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.