దారుణం... టెక్కీ సజీవదహనం... చేతబడి నెపంతో బావమరిది భార్య ఘాతుకం...
ఓవైపు ప్రపంచమంతా ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుని పరుగులు పెడుతుంటే... మరోవైపు ఇప్పటికీ మంత్రాలు,తంత్రాలు,చేతబడులు వంటి అనాగరిక మూఢనమ్మకాల ఉచ్చుకు అమాయకులు బలైపోతూనే ఉన్నారు. ఈ ఏడాది తెలంగాణలోని పలుచోట్ల మూఢనమ్మకాల సంఘటనలు వెలుగుచూడగా... తాజాగా జగిత్యాల జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. చేతబడి నెపంతో బావమరిది భార్యే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్పై పెట్రోల్ పోసి సజీవ దహనం చేసింది. జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది.
అసలేం జరిగింది....
హైదరాబాద్లోని అల్వాల్కు చెందిన పాగిళ్ల పవన్ కుమార్ అనే సాప్ట్వేర్ ఉద్యోగికి జగిత్యాల జిల్లా బల్వంతపూర్కు చెందిన కృష్ణవేణితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. కృష్ణవేణికి విజయ్,జగన్ అనే ఇద్దరు సోదరులు ఉన్నారు. ఆధ్యాత్మికతను ఎక్కువగా విశ్వసించే విజయ్... జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు దాదాపు 1.5కి.మీ దూరంలో మంజునాథ ఆలయాన్ని నిర్మించారు. దాని పక్కనే ఓ కుటీరాన్ని నిర్మించుకుని నివసిస్తున్నారు.
పరామర్శించేందుకు వెళ్లిన జగన్-కృష్ణవేణి...
ఇటీవల కృష్ణవేణి రెండో అన్న జగన్ అనారోగ్యం బారినపడి మృతి చెందాడు. దీంతో పవన్-కృష్ణవేణి దంపతులు జగన్ భార్యను పరామర్శించేందుకు వెళ్లారు. సోమవారం(నవంబర్ 23) సాయంత్రం 7గం. సమయంలో మంజునాథ ఆలయ సమీపంలోని బావ మరిది విజయ్ కుటీరానికి చేరుకున్నారు. జగన్ భార్య సుమలత అక్కడే ఉండటంతో ఆమెతో మాట్లాడారు. ఈ క్రమంలో సుమలత... నీళ్ల కోసం కృష్ణవేణిని బయటకు పంపించింది. ఆ సమయంలో విజయం ఆలయంలో ఉన్నాడు.
జగన్ సజీవ దహనం...
ప్లాన్ ప్రకారమే కృష్ణవేణిని బయటకు పంపించిన సుమలత... పవన్ కుమార్ను గదిలో బంధించి పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో పవన్ ఆ గదిలోనే సజీవదహనమయ్యాడు. నీళ్ల కోసం వెళ్లి తిరిగొచ్చిన కృష్ణవేణి వదిన చేసిన ఘాతుకానికి హతాశయురాలైంది. పవన్ కుమార్ చేతబడి చేసి తన భర్త జగన్ను చంపించాడన్న మూఢనమ్మకంతో సుమలత ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. దీనిపై మృతుడు పవన్ భార్య కృష్ణవేణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుమలతతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
కుమ్రం భీం జిల్లాలోనూ..
కుమ్రం భీం జిల్లా తిర్యాణి మండలంలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. భీంజీగూడ పంచాయతీ తాటిమాదర గ్రామానికి చెందిన ఆత్రం లచ్చు(40) అనే రైతు ఆదివారం(నవంబర్ 22) తన పొలం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అయితే గ్రామానికి చెందిన ఓ కుటుంబం మంత్రాలు చేయడం వల్లే లచ్చు చనిపోయాడని అతని కుటుంబం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో ఇరు కుటుంబాల మధ్య గొడవలు కూడా జరిగాయి. దీనిపై లచ్చు భార్య మైనుభాయి పోలీసులకు ఫిర్యాదు చేశారు.