దొంగ భక్తుడు: అమ్మవారికి మొక్కులు, గుంజీలు తీసి.. ఆలయంలో కిరీటం చోరీ(వీడియో)
హైదరాబాద్: దొంగ భక్తుడు అంటే ఇతడే. ఎందుకంటే.. నగరంలోని ఓ అమ్మవారి ఆలయంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమ్మవారికి పరమ భక్తుడిలా దండాలు పెట్టాడు. గుంజీలు తీశాడు. ఇంకేముంది అనంతరం అమ్మవారికి పెట్టిన కిరిటాన్ని ఎత్తుకెళ్లాడు. ఈ ఉదంతమంతా ఆలయంలోని సీసీ కెమెరాల్లో రికార్డవడం గమనార్హం.
పరమ భక్తుడిలా..
వివరాల్లోకి వెళితే.. అబిడ్స్లోని దుర్గా భవానీ ఆలయంలో బుధవారం సాయంత్రం 6గంటల సమయంలో చోరీ జరిగింది. ఎవరూ లేని సమయంలో ఆలయంలోకి వచ్చిన ఓ వ్యక్తి.. పరమ భక్తుడిలా మొదట అమ్మవారికి దండం పెట్టాడు. గుంజీలు కూడా తీశాడు. ఆ తర్వాత అమ్మా క్షమించు అని వేడుకున్నాడు. ఆ తర్వాత అమ్మవారి వెండి కిరీటాన్ని ఎత్తుకెళ్లాడు. ఇదంతా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైంది.
కిరీటం పోయినట్లు గుర్తించి..
ఆ తర్వాత వచ్చిన భక్తులు, పూజారి అమ్మవారి కిరీటం కనబడకపోవడంతో ఆందోళన చెందారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయానికి చేరుకున్న పోలీసులు.. అక్కడి సీసీ కెమెరాల ఫుటేజీని చూశారు. చోరీ జరిగిన విధానాన్ని పోలీసులు పరిశీలించారు. కిరీటం విలువ రూ. 20 వేల వరకు ఉంటుందని ఆలయ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ దొంగ భక్తుడి కోసం గాలింపు చేపట్టారు.
పరమ భక్తుడే దొంగగా మారడా అన్నట్లుగా..
కాగా, ఆ దొంగ భక్తుడు దొంగతనానికి ముందు చేసిన విన్యాసాలు నవ్వుపుట్టించేలా ఉన్నాయి. పరమ భక్తుడిలా నటిస్తూనే ఈ దొంగతనం చేయడం గమనార్హం. కిరీటాన్ని షర్టులోపల దాచుకుని బయటికి వెళ్లిపోవడం కూడా సీసీ కెమెరాల్లో రికార్డైంది. కాగా, దొంగలు ఇలా చేస్తారా? లేదా? తరచూ ఇక్కడికి వచ్చే భక్తుడే ఎవరైనా ఈ దొంగతనానికి పాల్పడ్డాడా? అనేది తేలాల్సి ఉంది.