అరిస్తే నీ కొడుకును చంపేస్తా: రైలులో మహిళను బెదిరించి, నగలు, నగదు చోరీ
కాగజ్నగర్: ఓ దోపిడీ దొంగ రెచ్చిపోయాడు. భద్రాచలం రోడ్డు-సిర్పూరు(టి) (57123) సింగరేణి ప్యాసింజర్ రైలులో బుధవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఓ మహిళా ప్రయాణికురాలిని బెదిరింపులకు గురిచేశాడు.
రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికురాలిని, ఆమె కుమారుడిని చంపుతానంటూ బెదిరింపులకు గురిచేసి.. ఆమె వద్ద ఉన్న నగలు, నగలను అపహరించాడు. అనంతరం సిర్పూరు(టి)రైల్వేస్టేషన్ సమీపంలో దిగి పారిపోయాడు. ఈ ఘటనపై బాధితురాలు కాగజ్నగర్ రైల్వేస్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ఆరోగ్యం బాగోలేకపోవడంతో కొడుతో..
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్పూరు(టి) మండలం హీరాపూర్ నివాసి డి శశికళ-సంతోష్ దంపతులు వరంగల్లో కూలి పని చేసి జీవిస్తున్నారు. ఆరోగ్యం బాగా లేక సిర్పూరు(టి) సివిలాసుత్రిలో చికిత్స నిమిత్తం శశికళ తన ఐదేళ్ల కుమారుడు సాయికృష్ణతో కలిసి వరంగల్లో సింగరేణి ప్యాసింజర్ రైలులో బుధవారం సిర్పూరు(టి)కి బయలు దేరారు.
బోగిలో కొడుకుతో బాధితురాలు మాత్రమే
కాగా, ఆ రైలు మధ్యాహ్నం 2.23 నిమిషాలకు కాగజ్నగర్ రైల్వేస్టేషన్కు చేరుకొని మధ్యాహ్నం రెండున్నర గంటలకు సిర్పూరు(టి)వైపు బయలుదేరింది. శశికళ ప్రయాణిస్తున్న రైలు బోగిలో కేవలం ఆమెతో పాటు మరో మహిళ ఉండగా, వేంపల్లి రైల్వేస్టేషన్లో ఆ మహిళ కూడా దిగిపోయింది. దీంతో ఆ బోగిలో శశికళతో పాటు, ఆమె ఐదేళ్ల కుమారుడు మాత్రమే ఉన్నారు.
నీ కొడుకును చంపేస్తా అంటూ దోపిడీ
ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె ప్రయాణిస్తున్న బోగీలోకి వచ్చి ఆమె గొంతునొక్కి ఆమె వద్ద ఉన్న నగదు రూ. 2600, ఆమె మెడలో ఉన్న అరతులం పుస్తెలు, గుండ్లును లాక్కున్నాడు. ‘అరిస్తే నీ కుమారుడిని రైలు నుంచి పడవేస్తాను' అంటూ ఆమెను బెదిరింపులకు గురిచేశాడని, సీటు కింద పడవేసి గొంతునొక్కాడని బాధితురాలు కన్నీళపర్యంతమైంది.
నడుస్తున్న రైల్లోంచి దిగిపోయాడు
రైలు సిర్పూరు(టి) రైల్వే స్టేషన్కు రాగానే.. ఆ దుండడుగు రైలు స్లోగా నడుస్తుండగానే దిగి పారిపోయాడని బాధితురాలు చెప్పింది. బాధితురాలు సిర్పూరు(టి) రైల్వే అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కాగజ్నగర్లోని రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలంటూ సూచించారు. దీంతో ఆమె స్థానిక రైల్వే పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కాగజ్నగర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించి నిందితుడ్ని పట్టుకుంటామని చెప్పారు.