విషాదాంత కథ .... అమృత , ప్రణయ్ ల లవ్ స్టోరీపై సినిమా త్వరలో
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అమృత,ప్రణయ్ల ప్రేమ ఉదంతం విషాదాంతం అయిన విషయం తెలిసిందే . అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కథలో మరింత విషాదం చోటు చేసుకుంది. ప్రేమ పగగా మారి చివరకు ప్రాణాలు తీసే,ప్రాణాలు తీసుకునే దాకా సాగిన ఈ కథ సినిమా తీస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చిన ఓ డైరెక్టర్ సినిమా తీసే పనిలో బిజీగా ఉన్నారు .
అమృత ప్రణయ్ ల కథలో ఊహించని ట్విస్ట్ లు
కూతురు అమృత కులాంతర వివాహం చేసుకుందని అక్కసుతో అల్లుడు ప్రణయ్ని అతిదారుణంగా చంపించాడు మారుతీరావు. ఆ తర్వాత తన కూతురు తిరిగి తన దగ్గరకు వస్తుందని ఆశించాడు . కానీ అమృత అత్తింట్లోనే ఉండి తన తండ్రిపై న్యాయ పోరాటం చేస్తుంది. ఇక ఏడాదిన్నర తర్వాత అల్లుడిని హత్య చేయించిన మారుతీరావు కూతురు తిరిగి రాదనీ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకోవడంతో మరోసారి ఈ కేసు సంచలనంగా మారింది. ఆయన్ని కడసారి చూడటానికి వెళ్లిన అమృతకు నిరాశే మిగిలింది. మొత్తం ఒక ట్రాజెడీ , సెంటిమెంట్ లవ్ స్టోరీగా సాగింది అమృత, ప్రణయ్ల ప్రేమ కథ .
అమృత ప్రణయ్ లవ్ స్టోరీ నే సినిమా
అయితే ఇప్పుడు ఈ ప్రేమకథ ఆధారంగా సినిమా తీస్తే బాగుంటుందని భావించిన శివనాగేశ్వర్ రావు అనే కొత్త డైరెక్టర్ సినిమా నిర్మించే పనిలో ఉన్నారు. ఈ సినిమాకి ఎంఎన్ఆర్ చౌదరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా మాస్టర్ రవితేజ టైటిల్ రోల్ ప్లే చేశాడు. సీనియర్ నటి జమున, బాలాదిత్య, అర్చన కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాలో సీనియర్ నటి అన్నపూర్ణమ్మ ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
త్వరలో సినిమా ప్రేక్షకుల ముందుకు
ఈ సినిమాకి టైటిల్ కూడా ఖరారు చేశారు. అదే ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు'. అతి త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని నటుడు బాలాదిత్య మీడియాతో తెలిపారు. అయితే ఈ సినిమాలో యదార్ధ సంఘటనలను చూపిస్తూనే సినిమా పరంగా కూడా ఇందులో టచ్ ఇచ్చారని తెలుస్తుంది.ఇందులో అర్చన తనకు జంటగా నటించిందని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా ద్వారా సామాజికంగా కనీసం ఒక ఆలోచన కలిగించాలని , మార్పు కోసం ప్రయత్నించాలని భావిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన ఈ కథ సినిమాగా
ప్రణయ్, అమృత ల ప్రేమ గాధ విషాదాంతం అయ్యింది .ప్రణయ్ చనిపోయి ఏడాదిన్నర అయ్యింది. ఇప్పటివరకూ దీని గురించి ఒక్క సినిమా కూడా రాలేదు. అందులోనూ ఇప్పుడు మారుతీరావు చనిపోవడం సంచలనంగా మారింది. మరోసారి అమృత, ప్రణయ్ పేర్లు బయటకి వచ్చాయి. దాంతో ఈ కథను సినిమాగా తీస్తే ప్రజలు ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు . ఇలాంటి సినిమాలు యూత్కి బాగా ఉపయోగపడతాయని . ప్రేమ పర్యవసానం కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందో ఈ సినిమా చెప్తుందని హీరో బాలాదిత్య అంటున్నారు.