సమ్మె ఎఫెక్ట్: బస్సు చక్రం ఊడిపోయింది.. ప్రయాణికుల బెంబేలు!
నల్గొండ: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? అనే సందేహం కలుగుతోంది. సరైన తనిఖీలు చేయకుండానే డిపోల నుంచి బస్సులను బయటికి పంపారు. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలో చోటు చేసుకుంది.
నార్కట్పల్లి నుంచి నల్గొండ వైపు వెళ్తున్న నార్కట్ పల్లి డిపోకు చెందిన బస్సు ఎల్లారెడ్డిగూడెం వద్దకు రాగానే ప్రమాదవశాత్తు వెనక చక్రాలు రెండు ఊడిపోయాయి. దీంతో బస్సులోని ప్రయాణికులంతా అరుపుకేకలు వేస్తూ బెంబేలెత్తిపోయారు.
ఆ సమయంలో బస్సులో 60మందిప్రయాణికులు ఉన్నారు. అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును నిలిపివేశాడు. దీంతో ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ సంఘాలు తమ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని ప్రకటించాయి. అక్టోబర్ 19న రాష్ట్ర బంద్కు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఆదివారం నుంచి అక్టోబర్ 18వరకు ఆర్టీసీ జేఏసీ తన కార్యాచరణను ఆదివారం చేయనుందన ప్రకటించింది.
అక్టోబర్ 13న రాష్ట్ర వ్యాప్తంగా వాంటావార్పు చేస్తూ నిరసన తెలపనున్నారు. తెలంగాణ ఉద్యోమంలో ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అక్టోబర్ 14న డిపోల ముందు ఆర్టీసీ కార్మికులు బైఠాయించనున్నారు.
అక్టోబర్ 15న రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహిస్తామని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నేతలు శనివారం మీడియాకు తెలిపారు. అక్టోబర్ 16న విద్యార్థి సంఘాలతో కలిసి నిరసనలు, ఆందోళన ప్రదర్శనలు చేయనున్నారు. 18న బైక్ ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకించారు. ఇక అక్టోబర్ 19న తెలంగాణ బంద్కు నిర్వహిస్తామని అన్నారు.
అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే. సమ్మె విరమించాలంటూ ప్రభుత్వం చేసిన హెచ్చరికలను ఆర్టీసీ కార్మికులు భేఖాతరు చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చే వరకూ సమ్మెను విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే, ఇప్పటి వరకు 1200 మంది ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో చేరారు.
కాగా, ఆర్మీసీ సంఘాల ప్రధాన డిమాండ్.. ఆర్టీసీన ప్రభుత్వంలో విలీనం చేయడం. అయితే, కేసీఆర్ సర్కారు మాత్రం ఆర్టీసీని విలీనం చేసేది లేదని స్పష్టం చేసింది. కాగా, ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం దసరా సెలవులను అక్టోబర్ 19 వరకు పొడిగించింది.