ఇదిగో ఆధారం, బాబుని ప్రశ్నిస్తే టీవీ9 శ్రీనిరాజు లీగల్ నోటీసు పంపడమేంటి: పవన్ ఆశ్చర్యం
హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో తనను టార్గెట్ చేసిన వారిపై ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం శ్రీనిరాజు తనకు పంపించిన లీగల్ నోటీసు అంశాన్ని ప్రస్తావిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించారు.
సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆరోపణలు చేశారంటూ శ్రీనిరాజు తనకు తన లాయర్ ద్వారా లీగల్ నోటీసులు పంపించారని పవన్ పేర్కొన్నారు. ఈ లీగల్ నోటీసుల పైన పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒకరి అభిప్రాయాన్ని చెప్పుకోవచ్చునని పేర్కొన్నారు.
Recommended Video
త్వరలో అరె ఓ సాంబా!! హుకుం సర్దార్ ప్రోగ్రాం: పవన్, 'టీవీ9, టీవీ5, ఏబీఎన్లను బహిష్కరించండి'
అసలు ఎందుకు స్పందించారు?
అసలు మీ క్లయింట్ తన ట్వీట్ పైన ఎందుకు స్పందించారో ఆశ్చర్యం వేస్తోందని పవన్ తన ట్వీట్లో శ్రీనిరాజు లాయర్ను ప్రశ్నించారు. శ్రీసిటీ మీ క్లయింటి శ్రీనిరాజుది అని సమాజానికి తెలుసునని, అలాగే టీవీ9కు అంతా ఆయనే అని పేర్కొన్నారు. మీరు మీ క్లయింట్ శ్రీనిరాజుకు సూచనలు చేయాలని ఆయన లాయర్కు పవన్ సూచించారు.
నా ఫీలింగ్స్ చెప్పాలను
ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఒక వ్యక్తి చేసే ట్వీట్లు ఆ వ్యక్తి ఫీలింగ్స్, అభిప్రాయాలు వెల్లడిస్తాయని, మీ క్లయింటును ఉద్దేశించి నేను చేయనటువంటి ఓ ట్వీట్కు ఆయన మీ ద్వారా స్పందించడం ఆశ్చర్యం కలిగిస్తోందని, మీ క్లయింట్ గురించి నిందలు మోపలేదని, ఆయన అలా ఊహించుకుంటున్నారని, లేదా తప్పు చేశానన్న భావనలో ఉండవచ్చునని పవన్.. శ్రీనిరాజు లాయర్కు రాశారు. 2018 ఏప్రిల్ 20న తాను చేసిన ట్వీట్లో మీరు చెప్పినట్లు పరోక్ష నిందలు లేదా ఆరోపణలు లేదా నిరాధార వ్యాఖ్యలు లేవని, నా ట్విట్టర్ అకౌంట్ ద్వారా నా ఫీలింగ్స్ను చెప్పానని, మీరు నోటీసులో చెప్పినట్లు చట్ట ప్రకారం ఇది ఎవరి పైన దాడి చేసినట్లు కాదన్నారు. తనకు ఎన్ని ఆటంకాలు కలిగించినా నా లక్ష్యం నుంచి పక్కదోవకు వెళ్లనని, సమాజంలోని అన్ని వర్గాలు ఎదగడానికి కృషి చేస్తానని, నేను పైన చెప్పిన వివరాలను బట్టి మీ క్లయింట్కు సరైన సలహాలు ఇస్తారని భావిస్తున్నానని పేర్కొన్నారు.
చంద్రబాబును ప్రశ్నించా, ఈ లీగల్ నోటీసులేమిటి?
పవన్ కళ్యాణ్ తన మరో ట్వీట్లో.. నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ప్రశ్నించానని పేర్కొన్నారు. శ్రీనిరాజు తన లాయర్ ద్వారా తనకు లీగల్ నోటీసులు ఎందుకు పంపించారని, లాజిక్ ఏమిటో నాకు అర్థం కావడం లేదని పేర్కొన్నారు.
టీడీపీకి ఇచ్చిన విరాళం ఆధారంతో పోస్ట్ చేసిన పవన్
మరో ట్వీట్లో పవన్ కళ్యాణ్.. తెలుగుదేశం పార్టీకి శ్రీనిరాజు ఇచ్చిన విరాళం అంటూ ఓ ఆధారం పోస్ట్ చేశారు. 2009-10లో ఇచ్చిన విరాళం వివరాలను పోస్ట్ చేశారు. అందులో చలసపతి శ్రీనివాస రాజు పేరుతో పాటు ఆయన పాన్ కార్డ్ నెంబర్, అడ్రస్ ఉంది.
అందుకే పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు అని ఫ్యాన్స్
నిత్యం తనను టార్గెట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా మూడు ఛానల్స్పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు ట్వీట్లు పెడుతున్నారు. అయితే పదేపదే ట్వీట్లు ఏమిటి అనే అనుమానం కొందరికి రావొచ్చు. అయితే ఇక్కడ జనసేన అభిమానులు ఓ మాట చెబుతున్నారు. వారికి మీడియా ఉంది కాబట్టి తమపై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని, పవన్కు ఏ మీడియా లేదని, అందుకే సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు.