బెదిరింపులు: కలెక్టరేట్ సాక్షిగా మహిళ ఆత్మహత్యాయత్నం
కలెక్టరేట్ సాక్షిగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
వరంగల్: కలెక్టరేట్ సాక్షిగా ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. హన్మకొండ మండలం వడ్డెపల్లి ప్రాంతంలోని పూరిగుట్ట సర్వే నెంబర్ 15లో కొన్ని ఏళ్ళుగా బొడబాతి, గుగులోతు ఉమ నివాసం ఉంటున్నారు. రోజువారి కూలీ పనిచేస్తూ జీవనం గడుపుతున్నారు.
1994లోని సర్వేనెంబర్ 15లో ఉన్న 9.39 ఎకరాల ప్రభుత్వ బంజరు భూమిని ఇళ్లు లేని నిరుపేదలకు నివేశిత స్థలాలకు కేయించింది. ఇందులో బినామి పేర్లతో లావుడ్యా బిక్యా నాయక్ ఇళ్లు నిర్మిస్తున్నాడని బాధితులు తెలిపారు. అక్కడే ఉంటున్న తమను ఖాళీ చేయమని పదే పదే బెదిరిస్తుంటే.. తాము అప్పటికే జేసీ వాకాటి కరుణకు ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. జేసీ విచారణ చేపట్టి బిక్యానాయక్పై చర్యలు తీసుకుని 2011లో ఇళ్ళ పట్టాలు ఇచ్చిందని తెలిపారు.
కాగా, ఇటీవల బిక్యానాయక్ మరణించడంతో అతడి కుమారుడు శ్రీనివాస్ నాయక్, అతని కుటుంబ సభ్యులు తమను బెదిరిస్తూ ఖాళీ చేయాలని భయభ్రాంతులకు గురిస్తున్నారని తెలిపారు. శ్రీనివాస్ నాయక్, హన్మకొండ తహసీల్దార్ కలిసి నెలరోజుల క్రితం పూరిగుట్టకు వచ్చి మీరు 15 రోజుల్లో ఖాళీ చేయాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇంతటితో ఆగకుండా ఈ నెల 3న లావుడ్యా శ్రీనివాస్ నాయక్, లావుడ్యా సునిల్, లావుడ్యా లక్ష్మిబాయి సుమారు 40 మందితో మా ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న సామాను బయట వేశారని తెలిపారు. దాడి జరుగుతున్న సమయంలో తాను ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు బోడ బాతి తెలిపారు.
ఈ విషయంపై తాము ఉన్నతాధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరుగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సోమవారం కలెక్టర్రేట్లో నిర్వహించిన గ్రీవెన్స్లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరుగలేదన్నారు. ఈ నెల 7వ తేదీన హన్మకొండ తహసీల్దార్ కార్యాలయంలో విచారణ ఉన్నందున ఒక రోజు ముందే సదరు మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాగా, బాధితులకు తగు న్యాయం చేస్తామని హన్మకొండ తహసీల్దార్ రవి తెలిపారు.
ఇద్దరు నకిలీ నక్సల్స్ అరెస్టు
మంగపేట: ప్రజాప్రతిఘటన పార్టీ పేరిట వసూళ్లకు పాల్పడుతున్న ఇద్దరు నకిలీ నక్సల్స్ను సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట పోలీసులు అరెస్టు చేశారు. ఏటూరునాగారం డీఎస్పీ దక్షిణామూర్తి మంగపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారి అరెస్టును చూపారు.
ఆయన కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తిమ్మంపేటకు చెందిన పిట్టల శ్రీనివాస్, మహబూబాబాద్కు చెందిన వానపాముల రాంబాబు గత నెల 25న రాజుపేటలోని ఓ రైతు వద్దకు వెళ్లి నక్సల్మని.. బొమ్మ తుపాకీ చూపించి రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సదరు రైతు ప్రస్తుతం డబ్బులు లేవు, రెండు రోజుల్లో ఇస్తానని చెప్పాడు. రెండు రోజుల తర్వాత మళ్లీ రావడంతో తన వద్ద రూ.3 వేలు ఉన్నాయని.. ఇచ్చాడు.
అనంతరం స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సోమవారం ఉదయం బ్రాహ్మణపల్లి చెక్పోస్టు సమీపంలో ఎస్సై మహేందర్ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా.. నంబర్లేని ద్విచక్రవాహనంపై వస్తున్న శ్రీనివాస్, రాంబాబును పట్టుకున్నారు. వారిని సోదా చేయగా బొమ్మ తుపాకీ, రూ.1600 నగదు లభించింది. వెంటనే అదుపులోకి విచారించగా.. పీపీజీ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు అంగీకరించారని డీఎస్పీ చెప్పారు. సమావేశంలో సీఐ రఘుచందర్, సిబ్బంది పాల్గొన్నారు.