మరో అమ్మాయి ప్రేమలో భర్త: ఫారెస్ట్ రేంజ్ మహిళా అధికారి ఆత్మహత్య:
మహబూబ్నగర్: జిల్లాలోని మహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారెస్ట్ కార్యాలయంలో బుధవారం విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ మహిళా అధికారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖిల్లా ఘనపూర్కు చెందిన వహీదాబేగం(32) మహ్మదాబాద్ రేంజ్ కార్యాలయంలో డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త భాను ప్రకాశ్ జిల్లా ఫారెస్ట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నారు.
కాగా, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న సమయంలో వహీదాబేగం, కొల్లాపూర్కు చెందిన భానుప్రకాశ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో, కొంత కాలం తర్వాత వారిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.
అయితే, డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఓ అమ్మాయితో భానుప్రకాశ్కు తాజాగా పరిచయం ఏర్పడి, ప్రేమగా మారింది. దీంతో ఆమెను ఇంటికి తీసుకొస్తానని చెప్పడంతో భానుప్రకాశ్, వహీదాబేగం మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన వహీదాబేగం బుధవారం ఫారెస్టు కార్యాలయంలోనే పురుగులమందు తాగింది.
ఈ విషయాన్ని గుర్తించిన తోటి ఉద్యోగులు ఆమెను వెంటనే మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతూ వహీదాబేగం ప్రాణాలు వదిలారు. మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.