భర్తను మోసం చేసి రూ.41లక్షలు కాజేసింది: సీసీ కెమెరాల్లో దొరికిపోయింది, చివరకు..
హైదరాబాద్: కట్టుకున్న భర్తనే మోసం చేసి రూ.41లక్షలు కాజేసింది ఓ భార్య. ఈ ఘటన సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎల్బీనగర్ డీసీపీ వేంకటేశ్వర్రావు ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన కావలి నారాయణకు ఇద్దరు భార్యలు. మొదటి భార్య సుధతో కలిసి నగరంలోని దిల్సుఖ్నగర్లోని ఓ అపార్టుమెంటులో అద్దెకు నివసిస్తున్నాడు. వీరికి ఓ కుమారుడు.
41లక్షల ఇచ్చానంటూ భర్తకు ఫోన్
కాగా, జులై 28న నారాయణ తన పని నిమిత్తం చేవెళ్ల వెళ్లాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు మొదటి భార్య సుధ నుంచి ఫోను వచ్చింది. ఎవరో గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు ఇంటికి వచ్చారనీ, నీ భర్త డబ్బులు తెమ్మన్నాడని తెలపడంతో ఇంట్లోని రూ.41 లక్షల నగదును వారికి ఇచ్చానని పేర్కొంది.
షాక్కు గురైన భర్త
ఈ క్రమంలో షాక్కు గురైన నారాయణ అదేరోజు సాయంత్రం సరూర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సరూర్నగర్ పోలీస్ స్టేషన్ క్రైం పోలీసులకు తోడుగా సీసీఎస్, ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సీసీ ఫుటేజీతో తేలిపోయింది
కాగా, అపార్టుమెంటు సమీపంలోని సీసీ ఫుటేజీలను పోలీసులు పరిశీలించారు. ఆమె చెబుతున్న రోజున గుర్తుతెలియని వ్యక్తులెవరూ అపార్టుమెంటులోకి రాకపోవడంతో పోలీసులు సుధను తిరిగి ప్రశ్నించారు. దీంతో ఆమె అసలు విషయం ఒప్పుకోక తప్పలేదు.
నాటకం అందుకేనంటూ..
తాను భర్తకు మొదటి భార్యననీ.. ఇంతవరకు తన పేరిట ఏ ఒక్క ఆస్తి కూడా రాయలేదని సుధ చెప్పింది. దీంతో తనకు భద్రతగా ఉంటుందనే చోరీ జరిగినట్లు నాటకం ఆడానని తాపీగా వివరించింది. రూ.41 లక్షల నగదును బెడ్రూంలోని డబుల్ కాట్ మంచం కింద పెట్టెలో భద్రంగా దాచినట్లు తెలిపింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.