దారుణం: ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను ఎత్తుకెళ్లి ఏడుగురు గ్యాంగ్రేప్
ఖమ్మం: జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఎన్ని చట్టాలు చేసినా మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు ఆగడం లేదు. వివాహితపై ఏడుగురు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు.
ఇంట్లో నిద్రిస్తున్న వివాహితను..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రఘునాథపాలెం మండలానికి చెందిన 35ఏళ్ల వివాహితను శుక్రవారం రాత్రి ఆమె ఇంట్లో నిద్రిస్తుండగా.. ఇద్దరు యువకులు బలవంతంగా తీసుకెళ్లారు. నోరుమూసి ఆమెను ద్విచక్ర వాహనంపై నిర్మానుష్య ప్రాంతానికి తరలించారు. మరో ఐదుగురు యువకులు కూడా వారి వెంట వచ్చారు.
పత్తిచేనులోకి తీసుకెళ్లి..
అందరూ కలిసి ఆ మహిళను హర్యాతండాలోని పత్తి చేనులోకి తీసుకెళ్లారు. కాగా, నిందితులు ఆమెను అపహరిస్తున్న సమయంలో పక్కింట్లోవారు గమనించి పోలీసులకు సమచారం ఇచ్చారు. అంతేగాక, దూరం నుంచి వారిని అనుసరించారు. అయితే, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి అక్కడ్నుంచి పరారయ్యారు.
మద్యం తాగి దారుణం..
ఈ దారుణంగాపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. బానోతు మోహన్, బానోతు ఉపేందర్, అంగోతు కళ్యాణ్, బానోతు చంటి, అజ్మీరా నాగేశ్వరరావు, సుకినీ తండాకు చెందిన మాలోతు అశోక్, సునీల్ అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. అడిషనల్ డీసీపీ పూజ, రూరల్ ఏసీపీ వెంకట్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది శనివారం అత్యాచారం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడే మద్యం బాటిళ్లు ఉండటంతో మద్యంతాగి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు గుర్తించారు.
ఒకరి అరెస్ట్.. నిందితుల్లో మహిళా ప్రజాప్రతినిధి సోదరుడు..
సామూహిక అత్యాచారం ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. కాగా, ఓ మహిళా ప్రజాప్రతినిధికి వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తి నిందితుల్లో ఒకరని తెలిసింది. ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధితురాలి బంధువులు, గ్రామస్తులు రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులందరిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.