తన భర్తను పెళ్లాడిందని పైశాచికం: ఇనుప చువ్వలతో వాతలు పెట్టి, నగ్నంగా ఊరేగించారు
వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం డీసీ తండాలో దారుణం చోటుచేసుకుంది. తన భర్తను రెండో పెళ్లి చేసుకుందని ఆగ్రహించిన మొదటి భార్య బంధువులతో కలిసి రెండో భార్యపై దాడి చేసింది. సభ్య సమాజం తలదించుకునే విధంగా సాటి ఆడది అని కూడా చూడకుండా.. చెప్పెలేని చోట వాతలు పెట్టింది.
ఇనుప సువ్వలను కాల్చి వాతలు పెట్టి తీవ్రంగా హింసించింది. అనంతరం బంధువులంతా కలిసి ఆమెను వివస్త్రను చేసి గ్రామంలో ఊరేగించారు. సభ్యసమాజం తలగించుకునే ఈ ఘటన సోమవారం వెలుగుచూసింది.
డీసీ తండాకు చెందిన ఆంగోతు రవి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ పెద్దలు నిర్ణయించిన మేరకు స్వరూపను వివాహమాడాడు. అనంతరం అదే తండాకు చెందిన అనిత(24)ను ఎవరికి తెలియకుండా ఎనిమిది నెలల క్రితం రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఈ విషయం పై మొదటి భార్య స్వరూప తల్లిదండ్రులు పలుమార్లు కుల పెద్దల ఎదుట పంచాయతీ పెట్టించారు. అయినా రవి తన తీరు మార్చుకోకపోవడంతో.. ఆగ్రహించిన స్వరూప బంధువులు ఆదివారం రాత్రి అనితపై దాడి చేశారు.
కర్రలు ఇనుప సువ్వలతో ఆమెను చిత్రహింసలకు గురిచేసి అనంతరం ఆమెను వివస్త్రను చేసి తండాలో తిప్పారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.