తన ప్రియురాలు మరొకరితో మాట్లాడుతోందని యువకుడి ఆత్మహత్య
హైదరాబాద్: తాను ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయితో మాట్లాడుతోందని మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్మకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని పార్సిగుట్టలో నివసించే గోగు రాములు కుమారుడు గోగు సాయి కృష్ణ(18) ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
కాగా, తాను ప్రేమించిన అమ్మాయి మరో అబ్బాయితో మాట్లాడుతుండగా గమనించిన సాయికృష్ణ తన ఇంట్లోని బాత్రూమ్లో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే అతడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
కాగా, చికిత్స పొందుతూ సాయికృష్ణ మృతి చెందాడు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు వైద్యులు. సుసైడ్ నోట్ ఆధారంగా ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
ప్రేమించకుంటే పెట్రోల్ పోస్తానని బెదిరింపు
హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఓ యువతిని బెదిరింపులకు గురిచేశాడు ఓ ఆకతాయి. తనను ప్రేమించాలని.. లేదంటే పెట్రోల్ పోసి తగలబెడతానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.