తండ్రి మందలించాడని తనయుడి ఆత్మహత్య
ఆలస్యంగా ఇంటికొచ్చిన కొడుకును తండ్రి మందలించడంతో అతడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
జనగామ: ఆలస్యంగా ఇంటికొచ్చిన కొడుకును తండ్రి మందలించడంతో అతడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రఘునాథపల్లి మండలం రామన్నగూడెంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామన్నగూడెం గ్రామానికి చెందిన మేకల శ్రీనివాస్ కుమారుడు సంపత్ (21) ట్రాక్టర్తో వ్యవసాయ పనులు చేస్తుంటాడు.
సంపత్ బుధవారం ఉదయం పది గంటలకు మరో రైతు వ్యవసాయ భూమిని దున్నేందుకు ట్రాక్టర్పై వెళ్లాడు. రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చాడు. దీంతో తండ్రి అతన్ని మందలించాడు. మనస్తాపం చెందిన సంపత్ తన వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో సంపత్ ఇంటి సమీపంలో ఉన్న సింహాచలం సంపత్కు ఫోన్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని సంపత్ తెలిపాడు.
సింహాచలం ద్వారా సమాచారం అందుకున్న సంపత్ కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్లారు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న సంపత్కు పాలకుర్తిలో ప్రాథమిక చికిత్స చేయించి ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రంజిత్ రావు తెలిపారు.
మున్నెరువాగులో పడి బాలిక మృతి
మహబూబాబాద్ రూరల్: ప్రమాదవశాత్తు మున్నేరువాగులో 11ఏళ్ల బాలిక పడి మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గ్రామస్థులు, పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెడ్యాల గ్రామానికి చెందిన బుల్లి రామనాధం, సరిత దంపతుల కుమార్తె మునేశ్వరి(11) రెడ్యాలలో ఆరో తరగతి చదువుతోంది.
జనవరి 8న తల్లిదండ్రులు కొల్లపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అదే రోజు ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన మునేశ్వరి ఇంటికి రాలేదు. 10న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మున్నేరువాగులో మృతదేహం గుర్తించి, మహబూబాబాద్ ప్రాంతీయాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు రూరల్ ఎస్సై తెలిపారు.
ఒంటికి నిప్పింంచుకొని ఆత్మహత్య
కరీంనగర్: ఒంటికి నిప్పంటించుకొని మండలంలోని ఉప్పల్ గ్రామానికి చెందిన మహారాజు అశోక్ (46) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ రాహుల్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అశోక్ గత కొంతకాలంగా మతిస్థిమితం బాగాలేక ఇంట్లో వారితో తరుచూ గొడవపడేవాడని తెలిపారు.
అదే క్రమంలో బుధవారం రాత్రి కుటుంబ సభ్యులతో గొడవకు దిగిన అశోక్ ఇంట్లోని వారిని బయటకు పంపించి ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పింంచుకొని ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. దీంతో అశోక్ తీవ్రంగా కాలిన గాయాలతో సంఘటనా స్థలంలోనే మృతిచెందడం జరిగిందని తెలిపారు. కాగా, మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.