పెళ్లాడతానని వచ్చిన ఏపి యువతిని పంపేశారు: మనస్తాపంతో తెలంగాణ యువకుడి ఆత్మహత్య
వరంగల్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫేస్బుక్ ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నందిగామకు చెందిన పుప్పాల రామనాథం, స్వరూప దంపతుల కుమారుడు నవీన్(22) వరంగల్లోని డిగ్రీ కళాశాలలో ఫైనలియర్ చదువుతున్నాడు.
ఏడాది కిందట ఫేస్బుక్లో ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అప్పటి నుంచి ఫేస్బుక్లో, ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. వారం కింద ఆ యువతి నందిగామకు వచ్చి నవీన్ను పెళ్లి చేసుకుంటానని అతని తల్లిదండ్రులకు చెప్పింది.
ఇందుకు వారు అంగీకరించకపోగా, పూర్తి సమాచారం కావాలని చెప్పి ఇద్దరు వ్యక్తులతో ఆమెను ఇంటికి పంపించారు. మనస్తాపానికి గురైన నవీన్ పురుగుల మందు తాగాడు. ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
యువతిపై గ్యాంగ్రేప్
ఓ యువతిపైపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో జరిగింది. దేవరకొండ మండలానికి చెందిన బాలిక(16) తండ్రి మృతి చెందడంతో తల్లితో కలిసి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
పొలానికి వెళ్లి సాయంత్రం తిరిగి వస్తుండగా చెరువు సమీపంలో గ్రామానికి చెందిన పెనిమిల్ల అనిల్, ముంత పరమేశ్ అటకాయించి లైంగికదాడికి పాల్పడ్డారు. యువతి ఇంటికి తిరిగొచ్చాక హైదరాబాద్లో ఉన్న మేనమామకు ఈ విషయాన్ని తెలిపింది.
ఆయన డిండి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, యువతిని వైద్య పరీక్షల నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.