మరో బావను ప్రేమిస్తోందని మరదలి గొంతుకోశాడు: విద్యుత్ తీగలపై దూకి అతడు..
భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే నెపంతో సొంత మరదలినే గొంతుకోసి హత్య చేశాడో దుర్మార్గుడు. అనంతరం అతడు కూడా కోసుకొని, విద్యుత్తు తీగలపై దూకి ఆత్మహత్యకు
భూపాలపల్లి: జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే నెపంతో సొంత మరదలినే గొంతుకోసి హత్య చేశాడో దుర్మార్గుడు. అనంతరం అతడు కూడా కోసుకొని, విద్యుత్తు తీగలపై దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కారల్మార్క్స్ కాలనీలోని అయ్యప్ప ఆలయం సమీపంలో గాండ్ల ఓదెలు, విజయ దంపతులు నివాసం ఉంటున్నారు. పదేళ్ల క్రితం కొత్తగూడెం భద్రాద్రి జిల్లా మణుగూరు నుంచి ఇక్కడికి వచ్చారు. ఓదెలు కేటీకే 5 ఇంక్లైయిన్లో సింగరేణి కార్మికుడిగా పనిచేస్తున్నారు. వీరికి ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఇద్దరి కూతుళ్లకు పెళ్లిళ్లు చేశారు. చిన్న కుమార్తె సంధ్యారాణి(సింధు)(19) పట్టణంలోని ఓ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంత్సరం చదువుతోంది.
ఓదెలు సోదరి కుమారుడైన పాల్వంచకు చెందిన గణేష్(22) సంధ్యారాణిని కొద్ది నెలలుగా ప్రేమిస్తున్నాడు. గణపురం మండలంలోని కేటీపీపీలో పని ఉందనే కారణంతో మూడు రోజుల క్రితం భూపాలపల్లికి వచ్చాడు. మేనమామ ఇంట్లోనే ఉంటున్నాడు. ఇంట్లో వాళ్లు పనుల నిమిత్తం సాయంత్రం బయటకు వెళ్లారు. ఆ సమయంలో సంధ్య, గణేష్ మాత్రమే ఉన్నారు. సంధ్య మరో మేనబావను ప్రేమిస్తున్నట్లుగా గణేష్ కొద్ది నెలలుగా అనుమానిస్తున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది.
ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన గణేష్ ఇంట్లో ఉన్న కత్తితో ఆమె గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం తానూ గొంతుకోసుకున్నాడు. పక్క ఇళ్ల వారు అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడి నుంచి అతను పారిపోయాడు. పక్కనే ఉన్న రెండంతస్థుల భవనంపై ఎక్కి, 11 కేవీ విద్యుత్తు తీగలపై దూకి ఆత్యహత్యకు పాల్పడ్డాడు.
సంధ్యారాణి తల్లిదండ్రులకు ఈ విషయం తెలియజేయడంతో హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. కూతురు రక్తపు మడుగులో కనిపించడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వారి రోదనలు మిన్నంటాయి. ఈ దృశ్యం అక్కడి వారిని కలిచివేసింది.
కాగా, ఘటన సమాచారం అందుకున్న సీఐ వేణు, ఎస్సై వెంకట్రావ్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం క్లూస్ టీంను రప్పించి ఆనవాళ్లను సేకరించారు. విద్యుత్తు తీగలపై ఉన్న గణేష్ మృతదేహాన్ని కిందికి దించారు. మృతురాలు తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.