మాయమాటలు చెప్పి యువతిని గర్భవతి చేసిన యువకుడు: పరారీ
హైదరాబాద్: పెళ్లి పేరుతో 15ఏళ్ల యువతికి మాయమాటలు చెప్పి మోసం చేసిన ఓ యువకుడు, ఆమెను గర్భవతిని చేశాడు. యువతి గర్భిణి అని తెలియగానే యువకుడు పారిపోయాడు. మోసాన్ని ఆలస్యంగా గ్రహించిన యువతి హుమాయన్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. హుమాయన్నగర్ పరిధిలోని పోచమ్మబస్తీలో సదరు యువతి కుటుంబం అద్దెకు ఉంటోంది. ఆ ఇంట్లోనే కృష్ణ(20)తో పాటు మరో ముగ్గురు ఒక గదిలో అద్దెకు ఉంటున్నారు. వీరంతా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో ఒకే ఇంట్లో ఉండటంతో ఆ యువతితో కృష్ణ రోజూ మాట్లాడుతూ ప్రేమ నాటకం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. యువతి గర్భవతి అయిన తర్వాత ముఖం చాటేశాడు.
దీంతో పెళ్లి చేసుకోమంటూ యువతి నిలదీయడంతో కృష్ణ కనిపించకుండా పోయాడు. ప్రస్తుతం ఆ యువతి ఎనిమిది నెలల గర్భిణి. ఆమె హుమాయున్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, నిందితుడు కృష్ణ కోసం గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
మ్యాట్రీమోనీ పేరుతో నైజీరియన్ మోసాలు
భారతీ మ్యాట్రీమోనీ డాట్ కామ్ వెబ్ సైట్ ద్వారా అమ్మాయిలకు వల వేసి.. తాను లండన్లో డాక్టర్నంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ నైజీరియన్ను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో పలువురు యువతులను ఈ విధంగా మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. గిఫ్టుల పేరుతో అమ్మాయిల నుంచి రూ. లక్షలు వసూలు చేశాడని చెప్పారు.