లేడీ టెక్కీని ఫొటోలు, వీడియోలు తీసి వేధించిన వ్యక్తి అరెస్ట్
హైదరాబాద్: పక్కింట్లో ఉండే యువతిని లైంగిక వేధింపులకు గురిచేసిన ఓ ప్రైవేటు ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన నగరంలోని ఖైరతాబాద్లో బుధవారం చోటు చేసుకుంది.
అదనపు సీపీ(క్రైం) షిఖా గోయల్ తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులతో కలిసి ఖైరతాబాద్లో ఉంటున్న బాధిత యువతి హైటెక్ సిటీలోని ఓ బహుళజాతి సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తోంది. గుండారం రమేష్ అనే ప్రైవేటు ఉద్యోగి సదరు యువతి పక్కింట్లో ఉంటున్నాడు.
ఈ క్రమంలో సదరు యువతితో రమేష్ పలుమార్లు మాట కలిపాడు. కొద్దిరోజుల క్రితం ఆమె శంకర్పల్లిలోని ఓ రిసార్ట్స్కు సహోద్యోగులతో ఏప్రిల్ మొదటి వారంలో వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న రమేష్ అక్కడికి వెళ్లాడు. ఆమె ఫొటోలు తీశాడు. వద్దంటున్నా వినకుండా వీడియోలు చిత్రీకరించాడు.
అనంతరం ఆమె చెయ్యిపట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె తన తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పగా.. వారు రెండు రోజుల క్రితం 'షి' బృందానికి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రమేష్ను బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా మూడురోజుల పాటు జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.