షాకింగ్ : హైదరాబాద్లో నడిరోడ్డుపై కుప్పకూలిన యువకుడు..
హైదరాబాద్లోని ఈసీఐఎల్ చౌరస్తా ప్రాంతంలో బుధవారం(జూలై 8) ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆటో ఎక్కేందుకు వచ్చిన ఓ యువకుడు ఒక్కసారిగా రోడ్డు పైనే కుప్పకూలిపోయాడు. కరోనా భయంతో అతని దగ్గరికి వెళ్లేందుకు ఎవరూ సాహించలేదు.
కుటుంబ సభ్యులు 108 అంబులెన్సుకు ఫోన్ చేయగా... సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరినప్పటికీ... అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్దారించారు. మృతుడు జవహర్ నగర్కు చెందిన పృథ్వీరాజ్గా తెలుస్తోంది. గత 3 రోజులుగా అతను జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందిన అతన్ని... మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులు భావించారు.
బుధవారం వేరే ఆస్పత్రికి తరలించే ప్రయత్నంలో భాగంగా ఆటో ఎక్కేందుకు రాగా... రోడ్డు పైనే పృథ్వీ కుప్పకూలాడు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా,గత 3,4 రోజులుగా తెలంగాణలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వస్తోంది. అంతకుముందు,ప్రతీరోజూ వెయ్యి వరకూ నమోదైన కేసులు ఇప్పుడు 2వేలకు చేరువవుతున్నాయి. సోమవారం(జూలై 7) రాష్ట్రంలో 1831 కేసులు నమోదవగా... మంగళవారం 1879 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకూ మొత్తం కేసుల సంఖ్య 27,612కి చేరింది. మృతుల సంఖ్య 313కి చేరింది.