హృదయవిదారకం: నడుంపైనుంచి వెళ్లిన బస్సు, కాపాడంటూ వేడుకోలు
వరంగల్ జిల్లాలోని సోమిడి గ్రామానికి చెందిన సుంచు విక్రమ్(22), అతని స్నేహితుడు ద్విచక్రవాహనంలో కాజీపేట నుంచి హన్మకొండ వైపు వెళ్తున్నారు.
వరంగల్: జిల్లాలోని ఖాజీపేటలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై ఇద్దరు యువకులు వెళుతుండగా ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. కాగా, ఓ యువకుడి నడుం పైభాగం నుంచి బస్సు వెనక చక్రం వెళ్లింది. దీంతో కొనఊపిరితో ఉన్న అతడు తనను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశాడు.
అక్కడికి వచ్చిన తన తల్లిని కూడా కాపాడాలంటూ వేడుకున్నాడు. ఈ దృశ్యం అక్కడున్నవారిని కలిచివేసింది. చివరకు అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో ఆ కన్నతల్లి దిక్కులు పెక్కటిల్లేలా రోదించింది.
Recommended Video
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. సోమిడి గ్రామానికి చెందిన సుంచు విక్రమ్(22), అతని స్నేహితుడు శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్రవాహనంలో కాజీపేట నుంచి హన్మకొండ వైపు వెళ్తున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలోని కాజీపేట వంతెన మీద అదే మార్గంలో వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది.
కిందపడిన విక్రమ్ పైనుంచి బస్సు వెనక చక్రాలు వెళ్లడంతో విక్రమ్ తీవ్రంగా గాయపడ్డాడు. నడుము భాగం నుజ్జవడంతో పైకి లేవలేని స్థితిలో ఆర్తనాదాలు చేస్తూ ఉండిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్కు సమాచారమిచ్చారు.
అది రావడానికి 20 నిమిషాల సమయం పట్టింది. కాగా, ఈ 20నిమిషాలపాటు విక్రమ్ నరకయాతన అనుభవించాడు. కొన వూపిరితో కొట్టుమిట్టాడుతున్న విక్రమ్ 'తనను కాపాడండి' అంటూ కన్పించిన వారినల్లా చేతులు జోడించి' వేడుకున్నాడు. ఇంతలోనే సోమిడి నుంచి తల్లి రమ, తండ్రి వనరాజ్లు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
తల్లిని చూసిన విక్రమ్...'నన్ను బతికించమంటూ వేడుకోవడం' అక్కడున్న వాళ్ల హృదయాలను కదిలించింది. చివరకు అంబులెన్స్లో విక్రమ్ను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే, కాసేపటికే అతను మరణించడంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. పాలిటెక్నిక్ పూర్తిచేసిన విక్రమ్ లిఫ్టు మెకానిక్గా పని చేస్తున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.