సెల్ఫీ పిచ్చి: నవ్వుతూ ఉండగానే రైలు ఢీ, ఆస్పత్రిలో యువకుడు
Recommended Video
హైదరాబాద్: సెల్ఫీ పిచ్చితో ఓ యువకుడు రైలు పట్టాల వద్ద నిల్చుని ఫొటో దిగుతుండగా.. వెనుక నుంచి వచ్చిన రైలు అతడ్ని ఢీకొంది. దీంతో ఎగిరిపడ్డ అతడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన భరత్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది.
కాగా, అతడు సెల్ఫీ వీడియో తీసుకోవడంతో అతడ్ని రైలు వచ్చి ఢీకొనే దృశ్యాలు కూడా రికార్డయ్యాయి. ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది. కాగా, తీవ్రంగా గాయపడిన యువకుడి పేరు శివ అని తెలిసింది. ప్రస్తుతం అతడు లింగంపల్లిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని రైల్వే ఏస్పీ అశోక్ తెలిపారు. చేతికి, తలకు బలమైన గాయాలయ్యాయని, ప్రస్తుతం అతనికి ప్రాణాపాయమేమీ లేదని చెప్పారు.
సాహసోపేతమైన సెల్ఫీలు తీసుకోవాలనే ఉత్సాహంతో ప్రాణాలకు ప్రమాదమని తెల్సినా.. యువత ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ తమ ప్రాణాలను పోగొట్టుకోవడం విచారకరం. ఇప్పటికే చాలా మంది ఇలాంటి సెల్ఫీలు తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయినప్పటికీ యువతలో ఎలాంటి అవగాహన రాకపోవడం శోచనీయం.