ఇకపై రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి
హైదరాబాద్: రైల్వే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆధార్ కార్డుని తప్పని సరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే మంత్రిత్వ శాఖ నెల రోజుల్లో దీనికి సంబంధంచిన పూర్తి సమాచారాన్ని త్వరలోనే వెల్లడించనుంది.
ప్రస్తుతం 96 శాతానికి పైగా భారతీయులు ఆధార్ కార్డులను కలిగి ఉన్నారు. మిగతా నాలుగు శాతం ప్రజలు కూడా ఆధార్ కార్డులను ఇచ్చేందుకు కేంద్రం తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. కేవలం రిజర్వ్ టికెట్లకే కాకుండా అన్ రిజర్వ్డ్ టికెట్లకూ ఆధార్ తప్పనిసరి చేయనుంది.
ఐఆర్సీటీసీ వెబ్ సైట్ ద్వారా ఆన్లైన్లో టికెట్ ను రిజర్వేషన్ చేయించుకున్నా లేదా రిజర్వేషన్ కౌంటర్ల వద్ద టికెట్ను పొందినా కూడా ఈ వివరాలను అందించాలని తాజా ప్రతిపాదనలో కీలకమైన అంశంగా చెబుతున్నారు. రైల్వే టికెట్లను దళారులు ముందే బుక్ చేసుకుని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు.
ఇలా అమ్మడం వల్ల తలెత్తుతున్న సమస్యలకు పరిష్కారంగా ఈ ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. ఈ కొత్త విధానం వల్ల సీనియర్ సిటిజన్లు, స్వాతంత్య్ర సమరయోధులు, దివ్యాంగులు, విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నేరుగానే దీనివల్ల లబ్ధి చేకూరనుంది.