హైదరాబాద్లో ఆధార్ కలకలం.. పౌరసత్వం నిరూపించుకోవాలని 127మందికి నోటీసులు
హైదరాబాద్లో ఆధార్ సంస్థ నోటీసులు సంచలనం రేపుతున్నాయి. తప్పుడు సమాచారంతో ఆధార్ కార్డులు పొందారని నగరంలోని దాదాపు 127 మందికి ఆధార్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. వీరందరిని రేపు బాలాపూర్లోని మేఘన గార్డెన్స్కు పిలిచిన ఆధార్ సంస్థ.. విచారణ అధికారికి తమ పౌరసత్వాన్ని,జాతీయతను నిరూపించుకునే ఒరిజినల్ సర్టిఫికెట్లను సమర్పించాలని కోరినట్టు నోటీసులు అందుకున్నవారు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో దీన్ని చట్టపరంగా ఎదుర్కొనేందుకు హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయాలని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నిర్ణయించినట్టు సమాచారం. పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. UIDA అథారిటీని ప్రశ్నిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు వారు చెబుతున్నారు.ఆధార్ నోటీసులను ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తప్పు పట్టారు. ఇది అక్రమం అని,ఆమోదయోగ్యం కాదని అన్నారు.
ఇదిలా ఉంటే,తెలంగాణలో జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్) అప్డేట్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు కేరళ మాదిరిగా జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్)పై స్టే తీసుకురావాలని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఆయన సీఎం కేసీఆర్కు విజ్ఞప్తిచేశారు.
ఎన్పీఆర్లో భాగంగా మొత్తం 24 అంశాలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.వీటిల్లో ఇంటి నంబరు, కుటుంబ సభ్యుల సంఖ్య, ఓ ఇంట్లో ఉండేవారి సంఖ్య,మంచినీటి వసతి,మురుగునీటి పారుదల తదితర అంశాలపై ప్రశ్నలు వేస్తారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు ఎన్పీఆర్ అప్డేట్ కొనసాగనుంది. ఇక తెలంగాణ ప్రభుత్వం సీఏఏని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై అసెంబ్లీలో తీర్మానం కూడా చేయాలని ఇటీవలి కేబినెట్ భేటీలో నిర్ణయించారు.
పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై కేసీఆర్ ఇదివరకే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు వెల్లడించారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత పౌరసత్వ చట్టాలపై మాట్లాడిన ఆయన కేంద్రం తీరును తీవ్రంగా తప్పు పట్టారు. దేశ సెక్యులరిజాన్ని దెబ్బతీసే చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోమన్నారు. అంతేకాదు,బీజేపీయేతర ముఖ్యమంత్రులు,నాయకులతో దీనిపై సదస్సు కూడా నిర్వహిస్తామని చెప్పారు. అవసరమైతే 10 లక్షల మందితో సీఏఏ వ్యతిరేక సభ హైదరాబాద్లో నిర్వహిస్తామన్నారు.