ఓటరు జాబితా నుంచి ఆధార్ డేటా తొలగించడానికి హైకోర్టు నో
హైదరాబాద్ : ఓట్ల తొలగింపు వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తుంటే .. ఓటరు జాబితా నుంచి ఆధార్ డేటా తొలగించడానికి హైకోర్టు తిరస్కరించింది. ఓటర్ల జాబితాకు అనుసంధానం చేసిన ఆధార్ డేటాను తొలగించాలనే ఆదేశాలు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణకు ఏ రకమైన సాప్ట్ వేర్ వినియోగిస్తున్నారో వివరిస్తూ కౌంటర్ వేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ నెల 11కి వాయిదా వేసింది.
ఒకే దెబ్బ రెండు పిట్టలు ... ఆయోధ్య మధ్యవర్తిత్వంపై సల్మాన్ ఖుర్షీద్
సాఫ్ట్ వేర్ ద్వారా ఓట్ల తొలగింపు ..
ఓటర్ల జాబితాలో అవకతవకలపై గతేడాది కొడాలి శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలుచేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది. డూప్లికేట్ ఓటర్లను తొలగించేందుకు ఈసీ ఒక ప్రత్యేకమైన సాప్ట్ వేర్ అభివృద్ధి చేసిందని .. దాని ఆధారంగా తెలంగాణలో 27 లక్షలు ఏపీలో 19 లక్షల ఓట్లను తొలగించారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కేంద్ర ఎన్నికల సంఘం, తెలుగు రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు ప్రజలను తప్పుదారి పట్టించాయని .. భారీగా అర్హుల ఓటర్లను తొలగించారని విన్నవించారు.
అనుమతి లేకుండా అలా ఎలా ఇస్తారు ?
తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే .. ఏపీలో స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో ప్రజల వివరాలను సేకరించారని .. సర్వేలో ఆధార్ సంఖ్య ఓటర్లు గుర్తింపు కార్డు, ఇంటి చిరునామా, ఫోన్ నంబర్, పాన్ కార్డు, కుటుంబసభ్యుల వివరాలు సేకరించి .. వాటిని స్టేట్ రెసిడెంట్ డేటా హబ్ వద్ద భద్రపరిచారని చెప్పారు. తర్వాత ఆ డేటాను ఓటరు జాబితా రూపకల్పన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టు తెలిపారు. ఆధార్ సంఖ్యను కేవలం సబ్సిడీ పథకాలకే వర్తింపజేయాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని .. కానీ ప్రజల నుంచి ఎటువంటి అనుమతి లేకుండానే ఆధార్ సమాచారాన్ని ప్రభుత్వాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చాయని పిటిషనర్ పేర్కొన్నారు.
సమాచారం ఇస్తే తప్పేంటీ ?
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సేకరించిన సమాచారాన్ని ఎన్నికల సంఘంతో పంచుకుంటే తప్పేంటనీ, దాని ప్రభావం ఓటరు జాబితా రూపకల్పనపై ఎలా పడుతుందని ధర్మాసనం ప్రశ్నించింది. జాబితాలో తొలగింపులు, చేర్పులు వంటివి ఈఆర్ వో చూస్తారని ఈసీ తరపు న్యాయవాది తెలిపారు. ఈసీ వద్ద ఉన్న డేటా చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా .. మూడో వ్యక్తితో పంచుకునే ప్రసక్తే లేదని తెలిపారు.