తెలంగాణపై కేజ్రీవాల్ కన్ను: కెసిఆర్కు సోమనాథ్ భారతి సూచన
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం పైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఏఏపీ) దృష్టి సారించింది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఏఏపీ ఢిల్లీలో అధికారంలో ఉంది. ఇప్పటికే ఉత్తర భారత దేశంలోని పంజాబ్ తదితర రాష్ట్రాల పైన దృష్టి సారించింది. దక్షిణ భారత దేశం పైన కూడా మొదట్లో ఆ పార్టీ దృష్టి సారిస్తోంది.
అయితే, ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక అది కాస్త తగ్గిందనే చెప్పవచ్చు. మొన్నటి బీహార్ ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయలేదు. మహాకూటమి (జెడీయు, ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి) ఓటేయాలని కేజ్రీవాల్ బీహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. పంజాబ్ రాష్ట్రం పైన ఏఏపీ దృష్టి సారిస్తోంది.
తాజాగా, దక్షిణాదిలో కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఏఏపీ నేత సోమనాథ్ భారతి శుక్రవారం హైదరాబాదులో మాట్లాడారు. ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన తమకు లేదని చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైనే దృష్టి సారించామని చెప్పారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాలలో పోటీ చేసే స్థాయికి ఎదుగుతామని సోమనాథ్ చెప్పారు. ఢిల్లీలో వలె తెలంగాణ ప్రభుత్వం కూడా లోక్పాల్ తీసుకు రావాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు.
కాగా, ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి రాకముందు నుంచి ఆ పార్టీకి హైదరాబాద్, బెంగళూరు వంటి దక్షిణాది నగరాల్లో ఫాలోయింగ్ ఉంది. కేజ్రీవాల్ పిలుపు మేరకు ఇక్కడ కూడా ఏఏపీ అభిమానులు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇప్పుడు పార్టీ బలోపేతం పైన ఏఏపీ దృష్టి సారించడం గమనార్హం.