ఆసరా పింఛన్లు డబుల్.. జూన్ నుంచే అమలు.. ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ : తెలంగాణలో ఆసరా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులకు శుభవార్త. టీఆర్ఎస్ ఎన్నికల హామీల మేరకు ఆసరా పింఛన్లు డబుల్ కానున్నాయి. జూన్ నెల నుంచి లబ్ధిదారులకు ఇప్పుడు వస్తున్న దానికంటే డబుల్ పింఛను రానుంది. ఆ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఏప్రిల్ నుంచి ఇద్దామని భావించినా.. ఎన్నికల కోడ్ నేపథ్యంలో వీలుపడలేదు. లోక్సభ ఫలితాలు రావడంతో కోడ్ ముగిసింది. దాంతో ఆసరా పింఛన్లు పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. జులై నుంచి పెంచిన ఆసరా పింఛన్లు లబ్ధిదారులకు అందనున్నాయి.
బొకేలు వద్దు.. నోట్ బుక్స్ కావాలి.. ప్రజల మనసులు మళ్లీ గెలిచారుగా..!
ఆసరా పింఛన్లు డబుల్
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాకా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ ఆసరా పింఛన్ల పథకం తెరపైకి తెచ్చింది. ఎన్నికల హామీ మేరకు ఆయా వర్గాలకు ఆసరా పింఛన్లు అందిస్తోంది. అప్పటివరకు వృద్దులు, వితంతువులు తదితరులకు ఇచ్చే 200 రూపాయల పింఛన్ను ఏకంగా 1000 రూపాయలకు పెంచింది. అలాగే వృద్దులకు ఇచ్చిన 500 రూపాయలను 1500కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ఆసరా పింఛన్ల పథకం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. తెలంగాణ ఆసరా పింఛన్ పథకం ద్వారా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, హెచ్.ఐ.వి. - ఎయిడ్స్ బాధితులు లబ్ధి పొందుతున్నారు.
జూన్ నుంచి పెంచిన పింఛన్లు
ఆసరా పథకానికి ప్రజల్లో మంచి ఆదరణ లభించడంతో మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల వేళ పింఛన్లు రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించింది టీఆర్ఎస్. ఆ మేరకు వృద్దులు సహా ఆయా వర్గాలకు 1000 రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్ను డబుల్ చేస్తూ 2016 రూపాయలుగా ప్రకటించింది. అలాగే వికలాంగులకు 1500గా ఉన్న పింఛన్ను 3000 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
పెంచిన పింఛన్లను ఏప్రిల్ నుంచి ఇద్దామని ప్రభుత్వం భావించింది. అయితే ఎన్నికల కోడ్ నేపథ్యంలో అది సాధ్యపడలేదు. ఇక ఎన్నికల కోడ్ ముగియడంతో జూన్ నుంచి ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఆ క్రమంలో పెరిగిన పింఛన్లు జులై నుంచి లబ్ధిదారులు అందుకోనున్నారు. వృద్ధులు, వితంతువులు, చేనేత కార్మికులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, హెచ్.ఐ.వీ-ఎయిడ్స్ బాధితులు, ఒంటరి మహిళలు, బోదకాల బాధితులకు ఇకపై పెరిగిన పింఛన్ల ప్రకారం నెలకు 2016 రూపాయలు అందనున్నాయి. అలాగే దివ్యాంగులకు 3016 రూపాయల పింఛన్ లభించనుంది.
ఆసరా పింఛన్లకు అర్హులు ఎవరంటే..!
ఆసరా పింఛన్ల కోసం వృద్దులు దరఖాస్తు చేసుకోవాలంటే ఇదివరకు 65 సంవత్సరాల వయసుగా నిర్ధారించారు. అయితే 2019, ఏప్రిల్ ఒకటి నుంచి 57 సంవత్సరాలు నిండినవారు అప్లై చేసుకోవచ్చంటూ నిబంధనలు సడలించారు. ఆసరా పింఛన్కు అర్హుల వివరాలు చూసినట్లయితే..
వృద్దులు : 01.04.2019 నుండి 57 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న వృద్దులు ఆసరా ఫింఛను పథకానికి అర్హులు. జనన ధ్రువీకరణ పత్రము లేదా ఆధార్ కార్డు లేదా వయసును సూచించే ఏదైనా ఇతర డాక్యుమెంట్లు ఉంటే సరిపోతుంది. ఆ పత్రాలు లేకపోతే ప్రభుత్వ అధికారి లభ్ధిదారుని కుటుంబ సభ్యుల వయసు తదితర వివరాల ఆధారంగా నిర్ధారించవచ్చు. అప్పుడు కూడా కుదరనిపక్షంలో మెడికల్ బోర్డుకు సూచిస్తారు.
వికలాంగులు : వయస్సుతో సంబంధం లేదు. కనీసం 40 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వినికిడి లోపం ఉన్నవారైతే 51 శాతం వైకల్యం కలిగి ఉండాలి. వికలాంగులకు అందించే సదరాం సర్టిఫికెట్ లో 40 శాతం లేదా అంతకన్నా ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు.
వితంతువులు : 18 సంవత్సరాలు నిండినవారై, భర్త మరణ ధ్రువీకరణ పత్రము కలిగిన వారు అర్హులు. నిర్ధారణ సమయంలో భర్త మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా చూపించాలి. మరణ ధ్రువీకరణా పత్రం లేకపొతే జనన మరణ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం మూడు నెలల్లో ధ్రువీకరణ పత్రం పొందాలి. లబ్ధిదారుని పునర్వివాహం విషయంలో విలేజి సెక్రెటరీలు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం సర్టిఫై చేయాలి.
హెచ్.ఐ.వి - ఎయిడ్స్ ఉన్నవారు : యాంటీ రిట్రోవైరల్ థెరపీ చేయించుకుంటున్నవారు అర్హులు. వ్యాధిని నిర్ధారిస్తూ ఏదైనా ఆసుపత్రి యాజమాన్యం వారు అందించిన మెడికల్ సర్టిఫికెట్ నిర్ధారణ సమయంలో అవసరమవుతాయి.
చేనేత కార్మికులు : 50 సంవత్సరాలు అంత కన్నా ఎక్కువ వయస్సు కలిగిన వారు అర్హులు.
కల్లు గీత కార్మికులు : 50 సంవత్సరాలు నిండినవారై ఉండాలి. లబ్ధిదారుడు కల్లు గీత కార్మికుల సహాయక సంఘంలో సభ్యత్వం పొంది ఉండాలి.