హైదరాబాద్ తలెత్తుకొనే రోజు: కెసిఆర్, నిప్పులు చెరిగిన షబ్బీర్ అలీ
హైదరాబాద్: దివంగత అబ్దుల్ కలాం భరతమాత ముద్దుబిడ్డ అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం అన్నారు. కలాం గొప్ప మానవతావాది అని, అలాంటి మహనీయుని విగ్రహాన్ని ఆవిష్కరించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు.
ఆయన డీఆర్డీవోలో ఏర్పాటు చేసిన కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ తలెత్తుకుని నిలబడిన రోజు అన్నారు. కలాం దేశం గర్వించదగ్గ వ్యక్తి అన్నారు. నమ్మిన సిద్దాంతాన్ని ఆచరించి చూపించిన మహోన్నతుడన్నారు.
మిస్సైల్లను అభివృద్ధి చేసి మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కీర్తి గడించారని, భారత దేశ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారన్నారు. ఇస్రోలోఅనేక పరిశోధనలు చేశారని, కలాం ఎప్పుడూ సామాన్య జీవితమే గడిపారన్నారు.
తన జీవితాన్నే తన సందేశంగా డిఆర్డీవోలో ఉన్నపుడు కూడా చిన్న గదిలో గడిపారని గుర్తు చేశారు. కలాం మరణవార్త విని అందరం విషాదంలో మునిగిపోయామని, డీఆర్డీవోకు కలాం పేరు పెట్టాలని కేంద్రాన్ని కోరామన్నారు.
అసెంబ్లీలో తీర్మానాన్ని అంగీకరించిన కేంద్రానికి కెసిఆర్ ధన్యవాదాలు చెప్పారు. పొఖ్రాన్ అణు పరీక్ష చేసి భారత దేశ చాటారన్నారు. కొద్ది రోజుల క్రితమే కలాం సంతకం చేసి ఓ పుస్తకాన్ని తనకు పంపించారని కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. కలాం 2004లో తెలంగాణ అంశాన్ని ప్రస్తావించారన్నారు.
జిహెచ్ఎంసీ అధికారులతో కెసిఆర్ సమీక్ష
అంతకుముందు కేసీఆర్ జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీకి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు హాజరైయ్యారు.
సమావేశంలో నగరంలో రోడ్ల మరమ్మతులు, అక్రమ నిర్మాణాలు, మెట్రో పనులు వంటి తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. వర్షాల కారణంగా రోడ్లు పాడయ్యాయని, వాటిని యుద్ధ ప్రాతిపదికన బాగు చేయాలని కెసిఆర్ అధికారులకు సూచించారు.
అక్రమ నిర్మాణాలు ఆపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఇందుకు స్పెషల్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయాలని సూచించారు. అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు జనవరి నెలలో వచ్చే అవకాశం ఉన్నందున.. ఇంటి పన్ను పైన కూడా జిహెచ్ఎంసీ అధికారులు ఓ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
రూ.1200, అంతకు లోపు ఇంటి పన్ను కట్టే వారి నుంచి రూ.101 వసూలు చేయాలని జిహెచ్ఎంసి యోచిస్తోన్నట్లుగా తెలుస్తోంది. దీని ద్వారా 5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందనున్నావి. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల ఎఫెక్టే ఈ నిర్ణయానికి కారణమని చెబుతున్నారు.
కెసిఆర్ యూ టర్న్: షబ్బీర్
కెసిఆర్ సర్కార్ పైన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మండిపడ్డారు. కెసిఆర్కు పాలన అనుభవం లేకపోవడంతో రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందన్నారు. రూ.7500 కోట్ల మిగులు బడ్జెట్తో ఉన్న రాష్ట్రాన్ని 18 నెలల్లో అఫ్పుల రాష్ట్రంగా మిగిల్చారన్నారు.
కొన్ని ప్రభుత్వ అకౌంట్లు స్తంభింప చేశారని, దీనిపై తక్షణమే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. కెసిఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు.