అభయ్ హత్య కేసులో ట్విస్ట్: కుటుంబ విభేదాలే, వెనక పెద్ద ముఠా
హైదరాబాద్: హైదరాబాదులో సంచలనం సృష్టించిన పదోతరగతి విద్యార్థి అభయ్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అభయ్ని కిడ్నాప్ చేసేందుకు చిన్నసాయిని ముఠా పావుగా వాడుకున్నట్లు తెలుస్తోంది. అతని సాయంతో అభయ్ని కిడ్నాప్ చేసినట్లు సమాచారం.
అభయ్ హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. కుటుంబసభ్యుల మధ్య విభేదాలే అభయ్ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు నిందితులను ఆదివారం మీడియా ఎదుట ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
అభయ్ను స్కూటీపై తీసుకెళ్లిన కుర్రాడిని చిన్నసాయిగా గుర్తించటంతో పాటు అతడ్ని విశాఖలో అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు నిందితులను రాజమండ్రి పరిసరాలలో పట్టుకున్నారు. విజయవాడ రైల్వేస్టేషన్లో దొరికిన హంతకుల ఫోన్లో నెంబర్లపై నిఘా ఉంచిన పోలీసులు కేసు దర్యాప్తును వేగిరం చేసి నిందితులను పట్టుకోగలిగారు.అభయ్ హత్య వెనక హవాలా రాకెట్ కీలకపాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
అభయ్ తండ్రి రాజ్కుమార్ హవాలా వ్యాపారం నిర్వహిస్తున్నాడని, అతడి వద్ద రూ.కోట్లు ఉన్నాయన్న సమాచారంతో నిందితులు తొలుత అభయ్ను అపహరించి భారీగా డబ్బు డిమాండ్ చేసి, ఆ తర్వాత హత్య పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. చిన్న సాయికి డబ్బు ఆశ చూపించి అభయ్ను తీసుకురావాల్సిందిగా పురమాయించారు. అభయ్ అపహరణ కోసం నిందితులు ఆరు నెలలుగా పథకం రచిస్తున్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.
స్కూటీపై తీసుకెళ్లిన చిన్నసాయి గోషామహల్లోని హరిఓంకాలనీలో ప్రదీప్ ధారక్ అనే ప్లాస్టిక్ వ్యాపారి ఇంట్లో పని చేస్తున్నాడని అభయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. రాజమండ్రికి చెందిన చిన్నసాయి(21) ఆరు నెలల క్రితం ప్రదీప్ ఇంట్లో పనికి కుదిరాడు. తరచూ అభయ్ ఇంటికి వస్తుండేవాడు. అభయ్ని అపహరించింది ఎవరనేది పోలీసులు పరిశోధిస్తుండగా చిన్నసాయికి సంబంధించిన ఆధారాలు లభించాయి.
క్రితమే ఇంటికి వెళ్తానంటూ రాజమండ్రి వెళ్లాడని యజమాని ప్రదీప్ పోలీసులకు చెప్పారు. రాజమండ్రిలోని చిన్నసాయి కుటుంబ సభ్యులను పోలీసులు సంప్రదించగా వారు తమకేం తెలీదని చెప్పినట్టు సమాచారం. రూ.10కోట్లు డిమాండ్ చేసి, రూ.5కోట్లు కచ్చితంగా కావాలంటూ ఫోన్లో బెదిరించిన వ్యక్తి విజయవాడ రైల్వేస్టేషన్లో ఫోన్ పారేసి పరారయ్యాడు. ఆ ఫోన్లోని నంబర్లపై నిఘా వేసిన పోలీసులు చిన్నసాయిని పట్టుకోగలిగారు. చిన్నసాయి అందించిన సమాచారం ప్రకారం ఇద్దరు నిందితులనూ అదుపులోకి తీసుకున్నారు.
సాయి రాజమండ్రికి వెళ్తానని పది రోజుల క్రితం చెప్పింది అబద్ధమని సీసీటీవీలోని దృశ్యాల ద్వారా తేలింది. బుధవారం సాయంత్రం సుమారు ఐదు గంటల పాటు సాయితో కలిసున్నాక అభయ్ హత్యకు గురయ్యాడు. సాయి ఒక్కడే అభయ్ని చంపేందుకు ప్రయత్నిస్తే ప్రతిఘటించే అవకాశాలున్నాయి. సాయితో పాటు కనీసంగా మరో ఇద్దరు ఉండిఉంటారని, ఈ ముగ్గురూ కలిసి అభయ్ను హత్యచేసుంటారని పోలీస్ ఉన్నతాధికారులు అనుమానించారు. డబ్బు కోసం ఫోన్లో డిమాండ్ చేసిన వ్యక్తి గొంతు సాయిది కాదని నిర్ధారణ అయ్యింది.
అభయ్ని అపహరించేందుకు వృత్తి హంతకులను నియమించునే సామర్థ్యం సాయికి లేదు. అభయ్ కుటుంబం డబ్బున్న వారని తెలుసుకున్న నేరస్థులు సాయిని ముందుగా తమ వలలో వేసుకుని ఇలా చేసుంటారా? అన్న పోలీసుల అనుమానమే నిజమయ్యేటట్లుంది. సాయికి డబ్బు ఆశచూపించి అభయ్ని రప్పించారని పోలీసులు భావిస్తున్నారు.
అభయ్ హత్యకేసులో కొన్ని కీలకాధారాలు లభించాయని, సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను పరిశీలించాక హంతకులెవరన్నది ప్రాథమికంగా తెలిసిందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి చెప్పారు. ముగ్గురు కలసి అభయ్ని చంపేశారని భావిస్తున్నామని అన్నారు.