మనమే హీరోలం: సినిమాలే టార్గెట్గా సాయి బృందం, ‘చెడు మార్గమే శాపం’
హైదరాబాద్: భాగ్యనగరంలో సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్ కేసు మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. అభయ్ హత్యకేసులో నిందితులు సాయి, రవి, మోహన్లు వారే హీరోలుగా మొదట తమ సెల్ ఫోన్లలో లేదా కెమెరాతో ఓ షార్ట్ ఫిల్మ్ తీసి యూట్యూబ్లో పెట్టాలని ప్రణాళిక వేసుకున్నారు. ఆ తర్వాత ఆ లఘు చిత్రాన్ని దర్శకులు, నటులకు చూపించాలని నిర్ణయించారు. దీంతో తమకు సినిమాల్లో అవకాశం వస్తుందని భావించారు.
అయితే, ఇందుకోసం డబ్బును సంపాదించేందుకు తప్పుడు మార్గం ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలో అభయ్ని అపహరించి హత్యచేయడం.. పోలీసులు అరెస్ట్ చేయడంతో వీరి కలలు భగ్నమయ్యాయి. సినిమాల పిచ్చితో ఆరునెలల నుంచి సాయి ఫేస్బుక్, యూట్యూబ్, అంతర్జాలంలో రాత్రంతా సినిమాలు చూసి కథలు సిద్ధం చేసుకున్నాడు.
Also Read: అభయ్ హత్య గురించి మరిన్ని విషయాలు
క్రైమ్థ్రిల్లర్ సినిమాలు తీయాలని ముగ్గురూ అనుకున్నారు. సినిమాలు విజయవంతమైతే వచ్చే డబ్బుతో బ్రాండెడ్ దుస్తులు, ఇళ్లు, కార్లు కొందామని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన తర్వాత విచారణలో ఈ విషయాలు తెలిశాయి.
సినిమాల్లో అవకాశమే టార్గెట్
సినిమాల్లో నటులవుదామన్న కోరికతో సాయి, రవి, మోహన్లు సిద్ధమయ్యారు. లఘు చిత్రాలు తీసి యూట్యూబ్లో ఉంచడం, కొన్ని టీవీ ఛానెళ్లు లఘుచిత్రాలపై నిర్వహిస్తున్న పోటీలకు వీటిని పంపాలని నిర్ణయించుకున్నారు. సాయి కథ, చిత్రానువాదంతో పాటు హీరో పాత్ర పోషించాలని, రవి కూడా మరో హీరోగా మోహన్ సహాయనటుడిగా నటించాలని అనుకున్నారు.
వరుసగా నాలుగైదు చిత్రాలు తీశాక వాటికి లభించే ఆదరణతో ముందుకు వెళ్లాలనుకున్నారు. హీరోలుగా అవకాశాలు రాకపోతే హాస్యనటులైనా కావాలని అనుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఇద్దరు యువ దర్శకుల ఫోన్ నెంబర్లను సేకరించారు. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెరపై చూపించే మరో యువ దర్శకుడి చిరునామాను సంపాదించారు.
ఇద్దరు యువదర్శకుల కార్యాలయాలను సంప్రదించగా... సమాధానం లభించలేదు. దీంతో సాయి అనపర్తిలో తనకు పరిచయం ఉన్న కొందరితో మాట్లాడాడు. వారు సినిమాల్లో నటిస్తున్న వారి పేర్లు, చిరునామాలు చెప్పారు. వీరిలో ఒకరు సినిమా తీయడమే చాలా సులువని, రూ.50లక్షల నుంచి రూ.కోటి ఉంటే సరిపోతుందని చెప్పగా... ఎలా సంపాదించాలని ఆలోచించి అభయ్ని అపహరించాలని నిర్ణయం తీసుకున్నారు.
తప్పుడు మార్గమే శాపం
చిత్రపరిశ్రమకు సంబంధించిన అంశాలు, వివరాలను తెలుసుకునేందుకు సెల్ఫోన్ , ఇంటర్నెట్, సోషల్ మీడియాను ఎంచుకున్నాడు సాయి. ఇందుకోసం నెల జీతం రూ.7వేలలో రూ.3500 వరకూ ఖర్చుచేసేవాడు. వీటి ద్వారా సినిమానటుల వివరాలను తెలుసుకుని వారితో పరిచయం పెంచుకున్నాడు. రవి, మోహన్ పేర్లతో కూడా ఫేస్బుక్ ఖాతాలను తెరిచి కథానాయకులు, నటుల ఫేస్బుక్ ఖాతాల్లో వ్యాఖ్యలను పోస్ట్ చేసేవారు.
ఈ క్రమంలోనే 'కుర్ర తుఫాన్' అనే సినిమాలో నటించిన బాలు పౌల్ పరిచయమయ్యాడు. ఫిబ్రవరి నెలలో బాలుపౌల్ను సాయి నాలుగైదుసార్లు కలుసుకున్నాడు. నటన, డ్యాన్స్ వస్తే చాలు... రూ.లక్షలు సంపాదించవచ్చని బాలూపౌల్ సాయికి చెప్పాడు.
దీంతో సాయికి మరింత ఉత్సాహం వచ్చి సినిమా ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా డబ్బు సంపాదించాలనే దురాశతో చెడు మార్గాన్ని ఎంచుకున్నాడు. అభయ్ని కిడ్నాప్ చేసి, హత్య చేయడంతో వారి కలలు కల్లలు కావాడమే గాక, జైల్లో మగ్గాల్సిన దుస్థితి తెచ్చుకున్నారు సాయి, రవి, మోహన్.