అభయ్ హత్య: చిన్నసాయి వార్డుబాయ్ నుంచి.., ఆటోలోనే కిడ్నాప్!
హైదరాబాద్: సంచలనం సృష్టించిన పదో తరగతి విద్యార్థి అభయ్ హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. ఇద్దరు నిందితులను విశాఖలో, ఓ నిందితుడని రాజమహేంద్రవరంలో పోలీసులు అరెస్టు చేశారు. వారిని ఆదివారం మీడియా ముందు ప్రవేశ పెట్టనున్నారు.
అభయ్ కిడ్నాప్లో చిన్నసాయి కీలకంగా మారాడు. అతను కొన్నాళ్లు ఎల్బీ నగర్ సమీప న్యూహరిపురి కాలనీలోని వృద్ధాశ్రమంలో వార్డుబాయ్గా పని చేశాడు. అందులో పని చేస్తున్న రత్నం అనే మహిళ సాయిని తన బంధువని చెప్పి అక్కడ చేర్పించింది.
Also Read: ఇలా సంభాషణ: ఆంధ్ర గ్యాంగ్తో కలిసి అభయ్ కిడ్నాప్, హత్య (పిక్చర్స్)
వృద్ధాశ్రమంలోనే ఉండే ఓ కన్సల్టెంట్ సంస్థ బాధ్యురాలు కనకదుర్గ ద్వారా ఉద్యోగం పొందిన చిన్నసాయి ఆర్నెల్ల క్రితం చెప్పా పెట్టకుండా రాజమహేంద్రవరం వెళ్లిపోయాడు. తిరిగి అతడిని రప్పించిన ఆమె, ప్రదీప్ ధారక్ ఇంట్లో పనికి చేర్పించారు. తమ వద్ద చిన్నసాయి చక్కగా పని చేశాడనీ, పెట్టింది తినేవాడనీ కనకదుర్గ చెప్పారు.
ఉపాధి కోసమే సాయిని అక్కడ చేర్పించాం తప్ప, ఓ బాలుడి హత్యకు కారణమవుతాడనుకోలేదంటూ ఆమె వివరించారు. ఏడేళ్లుగా వృద్ధాశ్రమంలో పని చేస్తున్న రత్నం తన భర్త, కూతురుతో కలిసి మూడు రోజుల క్రితం ఊరికి వెళ్లిపోయింది.
కాగా, అభయ్ ఇంటికి సమీపంలోని ఓ వ్యాపారి వద్ద వంటమనిషిగా పని చేసే సాయి, మరొకరు శివ గోషామహల్లో మేస్త్రీగా, మూడోవ్యక్తి రాజు రోజువారీ కూలీగా పని చేస్తున్నారు. వీరితో పాటు అభయ్ కిడ్నాప్లో బీహార్కు చెందిన డ్రైవర్ లల్లన్ కూడా కీలకంగా వ్యవహరించాడు
నలుగురు నిందితులు అరెస్ట్
అభయ్ హత్య కేసులో పోలీసులు నలుగురు నిందితులను పట్టుకున్నారు. రాజమహేంద్రవరంకు చెందిన చిన్నసాయి అలియాస్ శేషు(21)తో పాటు అతగాడి ఇద్దరు స్నేహితులు కలిసి అభయ్ ప్రాణం తీశారని, మరో వ్యక్తి వీరికి సహకరించాడని గుర్తించారు.
శనివారం రాత్రి వీరందరిని అదుపులోకి తీసుకుని ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. ఆదివారం వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. స్నేహం పేరిట సంపన్నులతో పరిచయం పెంచుకుని, వారి పిల్లలను అపహరించి రూ.కోట్లు కొట్టేయ్యాలన్న పథకం అభయ్ హత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
అభయ్ని విడిచిపెట్టేందుకు రూ.10 కోట్లు డిమాండ్ చేసిన సాయి ఆయన తన వద్ద అంత డబ్బులేదని చెప్పడంతో, ఎక్కువసేపు అభయ్ని తమతో పాటు ఉంచుకుంటే ప్రమాదకరమని భావించాడు. ఆ భయం, కంగారులో కుర్రాడి ప్రాణం తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా ఆధారాలు సేకరించారు.
అభయ్ హత్య అనంతరం కేసును పరిశోధిస్తున్న క్రమంలో స్కూటీపై అభయ్ని తీసుకెళ్లింది చిన్నసాయిగా పోలీసులకు అధారాలు లభించాయి. సాయి నేపథ్యాన్ని పరిశీలించి వెంటనే ప్రత్యేక బృందాలను విజయవాడ, విశాఖ, రాజమహేంద్రవరం పంపించారు.
సాయి అతడి స్నేహితులు పారిపోయేటప్పుడు రైల్వే స్టేషన్లో పారేసిన సెల్ఫోన్లోని నంబర్లు నిందితులను పోలీసులకు పట్టించాయి. రాజమండ్రికి చెందిన సాయి, ఆరునెలల క్రితం అభయ్ ఇంటికి సమీపంలోని ప్రదీప్ ఇంట్లో పనికి కుదిరాడు.
ఆ తర్వాత అభయ్తో పరిచయం పెంచుకున్నాడు. అప్పుడప్పుడు అవసరానికి డబ్బు కూడా ఇస్తుండడంతో అభయ్ ఇంట్లో రూ.కోట్లు ఉంటాయని, అతన్ని అపహరించి, డబ్బు తీసుకుని పారిపోవాలని పథకం వేశాడు. ఇదే విషయాన్ని స్నేహితులకు చెప్పాడు.
పదో తరగతి పరీక్షలు ప్రారంభానికి ముందే అభయ్ని అపహరిస్తే తండ్రి అడిగినంతా డబ్బిస్తాడన్న ఆలోచనతో బుధవారం పథకం అమలుకు నిర్ణయించారు. అభయ్ తన స్కూటీతో బయటకు వస్తాడని తెలుసుకున్న సాయి, ఒకచోట ఆగి తానూ వస్తానని చెప్పగా ఇద్దరూ కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చేశారు.
దారుస్సలాంలోని ఓ హోటల్ వద్ద అభయ్, సాయిలు స్కూటీని వదిలేశారు. తన స్నేహితులు కూడా వెంట వస్తారని సాయి చెప్పడంతో అభయ్ ఆటోలో వెళ్లాడు. ఈ క్రమంలో సాయి స్నేహితులు వచ్చి వీరితో కలిశారు. రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో అభయ్ తండ్రి రాజ్కుమార్కు సాయి ఫోన్ చేస్తే కలవలేదు.
మరోవైపు అభయ్కు అనుమానం వచ్చి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దీంతో దొరికిపోతామని నిందితులు ముగ్గురూ అభయ్ని కొట్టారు. కాళ్లూచేతులూ కట్టేశారు. అరవకుండా నోరు, ముక్కుపై ప్లాస్టర్ బిగించారు. నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లాక రాజ్ కుమార్కు ఫోన్ చేశారు.
రూ.5కోట్లు కావాలని బెదిరించారు. అప్పటికే శ్వాస ఆడకపోవడంతో అభయ్ చనిపోయాడు. కంగారు పడ్డ సాయి... అట్టపెట్టెలో అభయ్ మృతదేహాన్ని ఉంచి, ప్లాస్టరుతో చుట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు ఆటోలో వెళ్లారు. రాత్రి పది గంటల ప్రాంతంలో అల్ఫా హోటల్ ఎదురుగా ఆ పెట్టెను వదిలి రైల్లో పరారయ్యారు.